నేను హిందువు వైపే ఉంటా: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
కరాచీ: పాకిస్తాన్లోని హిందువులకు ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దీపావళి పండుగ సందర్భంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పాక్లో మైనారిటీలుగా పలు ఇబ్బందులు అనుభవిస్తున్న హిందూ మతస్తులకు భరోసాగా నిలుస్తానని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.
వారికి అన్యాయం జరిగితే తాను చర్యలు తీసుకుంటానన్నారు. దీపావళి సందర్భంగా కరాచీలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఓ హిందువు ఇబ్బంది పడి, ఇబ్బంది పెట్టిన వ్యక్తి ముస్లిం అయితే ఆ ముస్లిం పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పాడు.
నేను హిందువుల వైపే ఉంటానని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్లో మైనారిటీల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ పై విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కుల, మత, వర్గాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ న్యాయం చేయడం తన విధి అని ఆయన పేర్కొన్నారు. బలహీనుల వైపు నిలవాలని తన మతం చెబుతోందని, ప్రతి మతమూ చెప్పేది అదేనని తెలిపారు. పాకిస్థాన్లో హిందూ, ముస్లింలు కలసి ఉంటున్నారని, సంతోషాన్ని కలసి పంచుకుంటున్నారని వివరించారు.
పాకిస్తాన్ దేశం ఏ ఒక్కరి కోసమే కాదని, అందరి కోసమని చెప్పారు. అందరిదైన ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రిని తాను అని చెప్పారు. మతం, కులం తదితరులతో తమకు సంబంధం లేదని చెప్పారు. పాకిస్తాన్లో హిందువులను బలవంతంగా ముస్లీంలుగా మారుస్తున్నారు. దీనిపై హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.