ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుంది: పాక్ కెప్టెన్ మిస్బా
కరాచీ: ప్రపంచ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్తాన్ సారథి మిస్బా ఉల్ హక్ జోస్యం చెప్పాడు. సిడ్నీ క్రికెట్ మైదానం స్పిన్కు బాగా అనుకూలిస్తుందని ఆయన అన్నాడు. ఇది భారత్కు అనుకూలించే అంశమని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా గొప్ప జట్టు అని, అయితే, తన అభిప్రాయం ప్రకారం ఆ జట్టును భారత జట్టు కట్టడి చేయగలుగుతుందని చెప్పాడు. సిడ్నీలో భారీ స్కోర్లు కొత్తకాదని చెప్పాడు. ప్రపంచ కప్లో లీగ్ దశలో శ్రీలంకపై ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లకు 376, వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా 408 పరుగులు చేసిందని గుర్తు చేశాడు.

బ్యాట్స్మెన్ చెలరేగడానికి ఎలాంటి అవకాశం ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాడు. సెమీ ఫైనల్స్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతాయని అనుకుంటున్నానని చెప్పాడు. కాగా, క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చెంది ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
సెమీ ఫైనల్ షెడ్యూల్... తొలి సెమీ ఫైనల్ (మార్చి 24, మంగళవారం) ఆక్లాండ్లో భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30, ఈడెన్ పార్క్ వేదిక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడుతాయి. రెండో సెమీ ఫైనల్ (మార్చి 26, గురువారం) సిడ్నీలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు, సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఫైనల్ (మార్చి 29, ఆదివారం) మెల్బోర్న్లో, భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు.












Click it and Unblock the Notifications