దటీజ్ యోగి స్టైల్!: 150 గంటలు, ఒక్క క్యాబినెట్ భేటీ లేకుండానే 50 నిర్ణయాలు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్.. వినూత్న కార్యక్రమాలతో తనదైన శైలిలో పాలనలో దూసుకుపోతున్నారు. ఇంతవరకూ ఒక్క క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించకుండానే 50కి పైగా న
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్.. వినూత్న కార్యక్రమాలతో తనదైన శైలిలో పాలనలో దూసుకుపోతున్నారు. ఇంతవరకూ ఒక్క క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించకుండానే 50కి పైగా నిర్ణయాలను తీసుకుని పాలనలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. అలహాబాద్, మీరట్, ఆగ్రా, గోరఖ్పూర్, ఝాన్సీలో మెట్రో రైలు ప్రాజెక్టు చెపట్టడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా..
150గంటల్లోనే..
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 150 గంటల వ్యవధిలో ఆయన 50కిపైగా నిర్ణయాలు ప్రకటించారు. చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న కబేళాల నిషేధం నుంచి యాంటీ-రోమియో స్క్వాడ్ల ఏర్పాటు వరకూ, కూరగాయల మార్కెట్లలో పరిశుభ్రత నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో బయో మెట్రిక్ నమోదు, పాన్ మసాలాల వాడకం రద్దు నుంచి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం వరకూ... యోగి తీసుకున్న పలు నిర్ణయాలు పాలనలో ఆయన శైలిని నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
ప్రజల నుంచి మంచి స్పందన..
ఉదయం 10 గంటల్లోగా ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ వేయించుకోకుంటే ఆ రోజుకు సెలవుగానే పరిగణిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు యోగి చేసిన హెచ్చరికలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
యోగి ముద్ర..
జూన్ 15 నాటికి అన్ని రాష్ట్ర రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు, అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరుపై నెలవారీ నివేదికలు, ప్రభుత్వ ఫైల్స్ ఇంటికి తీసుకు వెళ్లకుండా నిషేధం, రాజకీయ నాయకుల సెక్యూరిటీపై సమీక్ష, అధికారులు, మంత్రులు వారి ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు పాలనలో యోగి ముద్రను వేస్తున్నాయి.
విమర్శలు.. స్వాగతాలు..
అంతేగాక, ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, పాఠశాలలకు టీ షర్టులు వేసుకుని వెళ్లకుండా ఉపాధ్యాయులపై ఆంక్షలు, స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు, మానస సరోవరం యాత్రికులకు రూ. లక్ష సాయం వంటి పదుల కొద్దీ నిర్ణయాలు తీసుకున్నారు. యోగి నిర్ణయాలను కొందరు విమర్శిస్తున్నా.. చాలా మంది స్వాగతిస్తుండటం గమనార్హం.