రంగంలోకి ప్రశాంత్ కిషోర్: సమర్థులకోసం సర్వే, జగన్ ప్లాన్ ఇదే
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారపార్టీ బలాలు, తమ పార్టీ బలాలను బేరీజు వేసుకొనే పనిలో పడింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పకడ్బందీగా ఈ వ్యూహన్ని అమలుచేస్తున్నారు.
అమరావతి: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారపార్టీ బలాలు, తమ పార్టీ బలాలను బేరీజు వేసుకొనే పనిలో పడింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పకడ్బందీగా ఈ వ్యూహన్ని అమలుచేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో పాటు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ దఫా వైసీపీకి పనిచేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ సమాజ్ వాదీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.అయితే ఆ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనావేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.ఈ మేరకు నియోజకవర్గాలవారీగా వైసీపీతో పాటు ఇతర పార్టీల బలాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్.
టెక్నాలజీని ఉపయోగించుకొని అభ్యర్థుల ఎంపిక ఇతరత్రా వ్యవహరాలపై టిడిపి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేది.అయితే ఈ దఫా ఎక్కువగా వైసీపీ కూడ టిడిపి తరహలోనే వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది.
సమర్థుల కోసం వైసీపీ సర్వే
రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో అధికారపార్టీతో పాటు వైసీపీ అభ్యర్థుల బలాన్ని సమీక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో ఎవరు ఎంత మేరకు సమర్థులు? వారికన్నా వేరేవారు సమర్థులైతే వారెవరు?అన్న విషయాన్ని కూడ ఆ సంస్థ సమాచారాన్ని ఇవ్వనుంది. తదనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడ జరుగుతోందని ముఖ్యనాయకులకు జగన్ ఇప్పటికే చెప్పారని సమాచారం.గత నెల 15వ, తేదిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ కార్యాలయంలోనే సర్వే బాధ్యతలను స్వీకరించి తన యంత్రాంగం ద్వారా అవసరమైన చర్యలను ప్రారంభించారు.
నియోజకవర్గాన్ని యూనిట్ గా సర్వే
నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి మరో వైపు జగన్, ఇంకోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడ వారు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనాయకుల నుండి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ నివేదికలే కీలకం
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కాలంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చే నివేదికలే కీలకంగా మారనున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సిఫారసుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికతో పాటు, ఎన్నికల నిర్వహణ ఎత్తుగడల్లోనూ కీలకం కానున్నాయి.
.ఇతర పార్టీల బలబలాలపై కూడ అంచనా
రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, పార్టీల బలబలాలపై కూడ అంచనాకు రానున్నారు.ఆ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులను మూడు గంటలపాటు ఇంటర్వ్యూ చేశారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, జగన్ లకు సంబంధించి సానుకూల, వ్యతిరేక అంశాలపై వారి సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై కూడ సమాచారాన్ని రాబట్టారు.
ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు?
విపక్షనాయకుడు జగన్ వ్యవహరశైలి, రాజకీయ పోకడలపై ఒకవైపు ప్రజలు మరోవైపు ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారనే విషయమై వైసీపీ నాయకులను ప్రశాంత్ కిషోర్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోగలరు? మీకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటీ? అన్న అంశాలను కూడ సేకరిస్తున్నారు. ముందుగా వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఆశిస్తున్న నాయకుల్లో ఎవరికి ఎంత మేర పార్టీ శ్రేణులు మద్దతు ఉందనే విషయాన్ని తెలుసుకొంటున్నట్టు సమాచారం.