తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ సర్కార్ శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఈఆర్ఏసీ సహాయంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వీటిని రూపొందించారు. మొత్తం ప్రతిపాదిత 27 జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు.
ప్రతిపాదిత 27 జిల్లాలతో పాటు కొత్త జిల్లాల మ్యాప్లను వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్ లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది.
హైదరాబాద్కు సంబంధించి ఎటువంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలు అవుతాయి.
మరోవైపు జిల్లాల డ్రాప్ట్పై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. ఇదిలా ఉంటే తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా పైనున్న పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
ఆయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. తెలంగాణలో అక్టోబర్ 11 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.