Visakhapatnam steel Plant:తెలుగు ప్రజలకు ఎందుకంత ప్రత్యేకం.. దీని చరిత్ర ఏంటి..?
విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాపాడేందుకు ఉద్యమం చేస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతామంటే ఒప్పుకునేదే లేదని అటు కార్మిక సంఘాల నేతలతోపాటు, ఉద్యోగులు చెబుతున్నారు. రాజకీయ నాయకులూ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు
విశాఖ ఎక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమం
ఇక ఒకసారి విశాఖ ఉక్కు పరిశ్రమ చరిత్రను చూస్తే.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగింది. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం, ముందుండి నడిపించాడు. టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు. 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10వేలకోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది. ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది.
1994లో తొలిసారిగా నికర లాభం
1987 డిసెంబరు నాటికి కర్మాగారం నిర్మాణం పూర్తయ్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటికి నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. అయితే మొదట అంచనా వేసిన వేయం రూ.3897.28 కోట్లు మాత్రమే.. 1994లో మొదటిసారిగా రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది.
సొంతంగా గనులు లేకపోవడమే మైనస్..
అయితే ఈ పరిశ్రమకు సొంతంగా గనులు లేవు.. ఇదే దీనికి ఉన్న మైనస్ పాయింట్.. ఇక ఉక్కు ఫ్యాక్టరీ విలువ ప్రభుత్వ దరల ప్రకారం చూసిన రూ. 35,222 కోట్లు ఉంటుంది. ఇక మార్కెట్ విలువ ప్రకారం అయితే 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై రుణభారం 11,338 కోట్ల రూపాయలు ఉంది. వడ్డీ భారం 1,519కోట్ల రూపాయలుగా ఉంది. తరుగుదల కేటాయింపులు 1,111 కోట్ల రూపాయలు ఉన్నాయి. వార్షిక జీతభత్యాలు 2,662 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక 2019-2020 నికర నష్టం 4,021 కోట్లుగా ఉంది. ఇంత స్థాయిలో భారీ నష్టాలను భరిస్తూ నడపడం వలన ప్రజాధనం వృధా అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.
20వేల మందికి ప్రత్యక్షంగా..50 వేల మందికి పరోక్షంగా..
అయితే సొంత గనులు లేకనే పరిశ్రమకు ఇంత నష్టం వస్తుందని.. సొంత గనులు ఉంటే పరిశ్రమ లాభాల్లో పయనిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అమ్మకం సమస్యకు పరిస్కారం కాదని, ప్రణాళిక వేసి, దానిప్రకారం విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వేడుకుంటున్నారు. గనులు కేటాయించడం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని వెంటనే గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు వివిధ పార్టీల నేతలు. ఇక ఈ పరిశ్రమ కింద 20 వేలమంది ఉద్యోగులు ఉన్నారు.ఈ పరిశ్రమపై పరోక్షంగా మరో 50 వేలమంది ఉపాధి పొందుతున్నారు. దీనిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే తాము ఎటుపోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకుంది ఇలా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంద్ర్ ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.