'జయ' చికిత్సకు సంతకాలు పెట్టినవాళ్లెవరో బయటపెట్టండి: దీప డిమాండ్
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇంకా అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. ఎయిమ్స్ రిపోర్టులు, ప్రభుత్వం వివరణ పట్ల సంతృప్తి చెందని పలువురు అమ్మ మరణంపై అనుమానాలను లేవనెత్తుతున్నారు.
ముఖ్యంగా జయలలిత మేనకోడలు దీప జయకుమార్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయలలిత మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన దీప జయకుమార్.. జయలలిత మృతిపై విచారణ జరపించాల్సిందేనని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
[11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు]
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జయలలిత చికిత్స వివరాలను ఈ సందర్బంగా దీప ప్రస్తావించారు. 'జయలలితకు ఎక్మో వంటి చికిత్సలు అందించేందుకు బంధువుల సంతకాలు తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జయలలితకు రక్తసంబంధీకులుగా నాతో పాటు, నా సోదరుడు మాత్రమే ఉన్నాం. మేమిద్దరం ఆసుపత్రిలో సంతకాలు చేయలేదు.' అని దీప అన్నారు.
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో మేనత్త మరణం పట్ల తమలో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని, కాబట్టి దీనిపై న్యాయ విచారణ చేయించాల్సిందేనని దీప స్పష్టం చేశారు.