7.2 శాతం జీడీపీ వృద్ధి రేటుతో మళ్లీ చైనాను వెనక్కినెట్టిన భారత్!
న్యూఢిల్లీ: గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) వృద్ధిరేటు మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7.2 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. దీంతో మరోసారి చైనాను వెనక్కి నెట్టి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.
ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిపుణుల అంచనాలను మించి వృద్ధి రేటు నమోదవడం విశేషం. అంతకుముందు త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా మాత్రమే ఉంది. వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలతో పాటు వివిధ రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదు జీడీపీ పెరుగుదలకు కారణమని బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది.
ప్రభుత్వం వ్యయం పెరగడం వృద్ధిరేటుకు దోహదపడిందని ఆర్థికవేత్త అభిషేక్ ఉపాధ్యాయ చెప్పారు. బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తుల విలువ పెరుగుతుండటంపై ఈ మధ్యే ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
వీటిని కట్టడి చేయకపోతే అది ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు వరుస కుంభకోణాలతో సతమతవుతున్న మోడీ సర్కార్కు జీడీపీ వృద్ధి రేటు అంశం కాస్తా ఊరట ఇవ్వవచ్చునని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.