2027 నాటికి క్లీన్ స్వీప్.. భూ రికార్డులపై సీఎం కీలక ఆదేశాలు!
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. సీఎస్ సాయి ప్రసాద్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కించుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు నిలబడి కరతాళ ధ్వనులతో (స్టాండింగ్ ఓవేషన్) ఘనంగా అభినందనలు తెలిపారు.
సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని ఎండగట్టారు. రాష్ట్రంపై రూ. 9.74 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని, రూ. 1.30 లక్షల కోట్ల బిల్లులు బకాయి ఉన్నాయని వెల్లడించారు. 94 కేంద్ర పథకాలకు సంబంధించిన రూ. 10 వేల కోట్లను గత పాలకులు దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. "గతంలో రాష్ట్రం గుంతల రోడ్లతో విధ్వంసమైంది.. కానీ ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. సంపద సృష్టి ద్వారానే సంక్షేమం సాధ్యమనే 'సైకిల్' సూత్రాన్ని మనం అనుసరిస్తున్నాం" అని సీఎం స్పష్టం చేశారు.

నమ్మకానికి కేరాఫ్ ఏపీ: దిగ్గజ సంస్థల రాక
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడిందనడానికి గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, టిసిఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి రావడమే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. "నా కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం గర్వంగా ఉండేది.. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ఏపీకి తెచ్చాం" అని గుర్తు చేసుకున్నారు. దాదాపు రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు సాకారమైతే రాష్ట్రంలో 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని, గ్రీన్ ఎనర్జీ మరియు ఏఐ టెక్నాలజీలకు ఏపీని హబ్గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సుపరిపాలనే కొలమానం.. అధికారులకు కీలక ఆదేశాలు
పాలనలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులు పూర్తిగా ప్రక్షాళన కావాలని, భూముల విషయంలో 'జీరో ఎర్రర్' ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికేతర ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని, పబ్లిక్ రిలేషన్స్తో పాటు పబ్లిక్ డెలివరీ కూడా ముఖ్యమని సూచించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, కార్యదర్శులు 3 రోజులు, కలెక్టర్లు 8 రోజులు ఫీల్డ్ వర్క్ చేయాలని ఆదేశించారు.
ప్రగతి పథంలో 'సూపర్ సిక్స్' పథకాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న 100కు పైగా పథకాలు, విజయాలను సీఎం ఈ సందర్భంగా వివరించారు.
- అన్నదాత సుఖీభవ: 46 లక్షల మంది రైతులకు రూ. 8,985 కోట్ల జమ.
- తల్లికి వందనం: 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,090 కోట్ల సాయం.
- ఉచిత గ్యాస్: దీపం-2 కింద 4 కోట్ల సిలిండర్ల పంపిణీ.
- మౌలిక సదుపాయాలు: రూ. 861 కోట్లతో గుంతలు లేని రోడ్లు, అమరావతికి కేంద్ర గెజిట్, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.
ఏపీ పనితీరు దేశానికే బెంచ్ మార్క్ కావాలని, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. "డబ్బులు లేవనడం కాదు.. సంపద సృష్టి చేద్దాం" అంటూ కలెక్టర్లలో ఉత్సాహం నింపారు. ఈ సదస్సులో జీఎస్డీపీ వృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.














Click it and Unblock the Notifications