అమెరికాకు బిగ్ షాక్! ఇరాన్ యుద్ధ విమానాలకు పాక్ 'షెల్టర్'..
ప్రపంచానికి ఒక ముఖం.. లోపల మరో ముఖం! అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిగా నటిస్తూనే, పాకిస్థాన్ తన 'నక్కజిత్తుల’ రాజనీతిని ప్రదర్శించింది. యుద్ధం పతాకస్థాయిలో ఉన్న సమయంలో ఇరాన్ సైనిక విమానాలను అమెరికా వైమానిక దాడుల నుండి కాపాడేందుకు పాక్ తన ఎయిర్బేస్లలో ఆశ్రయం కల్పించిందనే సంచలన వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ తటస్థ మధ్యవర్తిగా బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్, అగ్రరాజ్యం వెన్నుపోటు పొడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే, ఇరాన్ తన అత్యంత కీలకమైన గూఢచార మరియు నిఘా విమానం (RC-130)తో సహా పలు యుద్ధ విమానాలను పాకిస్థాన్లోని 'నూర్ ఖాన్’ ఎయిర్బేస్కు తరలించింది. అమెరికా క్షిపణి దాడుల నుండి తన గగనతల ఆస్తులను కాపాడుకోవడానికి ఇరాన్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్కు పాకిస్థాన్ తెరవెనుక పూర్తి సహకారం అందించింది.

సమర్థించబోయి.. అడ్డంగా బుక్కైన పాక్!
ఈ నివేదికపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ (MoFA) స్పందిస్తూ.. "అసలు ఆ విమానాలకు యుద్ధంతో సంబంధమే లేదు.. అవి కేవలం దౌత్యపరమైన చర్చల కోసం వచ్చాయి" అంటూ ఖండించే ప్రయత్నం చేసింది. కానీ, అదే ప్రకటనలో "ఇరాన్ విమానాలు ప్రస్తుతం పాకిస్థాన్లో పార్క్ చేసి ఉన్న మాట నిజమే" అని అంగీకరించి అడ్డంగా దొరికిపోయింది. దౌత్య చర్చల కోసం నిఘా విమానాలు (Reconnaissance planes) ఎందుకు వస్తాయన్న అమెరికా అధికారుల ప్రశ్నకు పాక్ వద్ద సమాధానం లేదు.
మండిపడ్డ సెనేటర్ లిండ్సే గ్రాహం.. అమెరికాలో తీవ్ర ఆగ్రహం!
ఈ వార్త బయటకు రావడంతో అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. "పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రను తక్షణమే పునఃపరిశీలించాలి. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ను ఇక నమ్మలేం" అని ఆయన ఎక్స్ (X) వేదికగా హెచ్చరించారు. అటు డొనాల్డ్ ట్రంప్ వర్గం కూడా పాక్ తీరుపై తీవ్ర అసహనంతో ఉంది. ఇరాన్ వైఖరిని పాకిస్థాన్ తప్పుగా చిత్రించి అమెరికాను తప్పుదోవ పట్టించిందని వైట్ హౌస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్లోనూ ఇరాన్ విమానాలు!
పాకిస్థాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ గడ్డను కూడా ఇరాన్ తన విమానాల రక్షణ కోసం వాడుకుంది. మహాన్ ఎయిర్కు చెందిన పౌర విమానాలను అమెరికా దాడుల నుండి తప్పించడానికి కాబూల్ మరియు హెరాత్ విమానాశ్రయాల్లో పార్క్ చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
చైనా అండతోనే ఈ సాహసమా?
పాకిస్థాన్ ఇంత ధైర్యంగా అమెరికాను ఎదిరించడానికి వెనుక చైనా హస్తం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ఐపిఆర్ఐ (SIPRI) అధ్యయనం ప్రకారం, పాకిస్థాన్కు 80% ఆయుధాలను చైనానే సరఫరా చేస్తోంది. ఒకవైపు వాషింగ్టన్ను మచ్చిక చేసుకుంటూనే, మరోవైపు బీజింగ్ మరియు టెహ్రాన్ ప్రయోజనాలను కాపాడటం పాక్ డబుల్ గేమ్ లో భాగమని స్పష్టమవుతోంది.
మరోవైపు, ఇరాన్ చమురు రవాణాకు సహకరిస్తున్న హాంకాంగ్, యూఏఈ, ఒమన్కు చెందిన పలు కంపెనీలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. తాజా పరిణామాలతో పాకిస్థాన్పై కూడా అమెరికా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.














Click it and Unblock the Notifications