ఎండాకాలంలో వానలు.. మూడ్రోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర అంతర కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న గాలుల అంతరాయం (ద్రోణి) కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియగా, గురువారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండటం వాతావరణ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, కల్లాల్లో ఉన్న మిరప పంటల విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిరప కాయలు తడవకుండా టార్పాలిన్ పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలి. తేమ తగిలితే పంట రంగు మారి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. కోసిన ధాన్యం కుప్పలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం బస్తాలను సురక్షిత ప్రాంతాలకు లేదా గోదాములకు తరలించడం ఉత్తమం. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండవద్దని విజ్ఞప్తి.

ప్రాంతాల వారీగా అంచనా
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం పరిసరాల్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుంది. దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల జల్లులు పడవచ్చు, అయితే రేపు (శుక్రవారం), ఎల్లుండి (శనివారం) వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వేడి.. ఉక్కపోత.. వడగాలులు!
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఉక్కపోత ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో గురువారం వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 18 జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications