బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉంది. ఒక వైపు ఎండ తీవ్రతగా కొనసాగుతుండగా.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళా ఖాతం లో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించింది. రానున్న మూడు నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇది క్రమంగా బలపడుతోంది. ఈ నెల 12,13 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది మరింతగా బలపడి తీవ్రమైన వాయుగుండంగా మారనుందని అంచనా వేసింది. ఇదే సమయంలో సముద్ర మట్టానికి సుమారు 0.9 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. వచ్చే మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది.

రెండు రోజులు భారీ వర్షాలు
ఒక వైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగానే.. తాజాగా వర్షాల పైన అప్డేట్ వచ్చింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యం ప్రాంతంలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అలాగే, పోలవరం జిల్లా పరిధిలోని వీఆర్పురంలో 40.6 డిగ్రీల మేర ఎండలు దంచికొట్టాయని అధికారులు వెల్లడించారు. నర్సీపట్నంలో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 12 మి.మీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కూడా 12 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.













Click it and Unblock the Notifications