ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం..?? డేంజర్ లో భారత్..??
అమెరికా-ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పైనా తీవ్రంగా ప్రభావం పడింది. దేశంలో గణనీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ సంక్షోభ ప్రభావం ప్రతి భారతీయ కుటుంబంపై కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరించారు. పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే లక్షలాది మంది పేదరికంలోకి జారుకోవచ్చని ఆయన అన్నారు. ప్రధాని మోదీ.. పౌరులను అనవసర ఖర్చులు తగ్గించి, విదేశీ మారక నిల్వలు సంరక్షించాలని కోరారు. ఇదిలా ఉంటే భారత్ లో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నిపుణుల ప్రకారం.. మాంద్యం ఒక్కరోజులో రాదు.. అది వివిధ దశల్లో పెరుగుతుంది. ప్రపంచ షాక్లు ఆర్థిక వ్యవస్థలను మాంద్యం వైపు నెట్టే ఈ ప్రక్రియనే "ఆర్థిక విపత్తు చక్రం" అంటారు.
ఈ చక్రం సాధారణంగా ముడిచమురు, గ్యాస్ ధరల పెరుగుదలతో ఆరంభమవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు ఇప్పటికే 100 అమెరికన్ డాలర్లను దాటాయి. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకోవడం పెద్ద సమస్య. ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసరాలు ప్రజలకు మరింత ఖరీదైనవిగా మారుస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. దీనివల్ల మార్కెట్ లో ద్రవ్య లభ్యత తగ్గి, వ్యాపారాలు, వినియోగదారులకు రుణాలు భారం అవుతాయి. అధిక రుణ ఖర్చులు, ఖరీదైన ముడిసరుకు కంపెనీల లాభాలను కుదిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి అనేక సంస్థలు ఉద్యోగుల తొలగింపులు, నియామకాల మందగింపును ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడిని పెంచుతోంది. ఉద్యోగాలు కోల్పోయినా లేదా జీతాల కోతలు ఎదుర్కొన్నా, ప్రజలు గృహ, కారు రుణాల EMIలు చెల్లించడానికి కష్టపడతారు.

కుటుంబాలు అనవసర ఖర్చులను తగ్గిస్తాయి. ఇది మార్కెట్లో డిమాండ్ను బలహీనపరుస్తుంది. చివరికి ఆర్థిక వ్యవస్థను తీవ్ర మందగమనంలోకి నెట్టవచ్చు. నిశ్చితత్వం లేని సమయాల్లో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 6 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని.. దానిని ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా లిక్విడ్ ఫండ్ల వంటి సురక్షిత ఆస్తులలో ఉంచాలి. అదనపు ఆదాయ వనరులు, అనవసర ఖర్చుల తగ్గింపు, సరైన ఆరోగ్య, జీవిత బీమా కవరేజీని కూడా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications