తిరుపతిలో గంగమ్మ జాతర కాదు "మారణకాండ".. మేనకా గాంధీ సంచలన లేఖ
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ సంచలన లేఖ రాశారు. తిరుపతిలో జరగనున్న గంగమ్మ జాతరలో జంతుబలులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. జాతరల పేరుతో జరిగే ఈ బలులను తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసింది.
సీఎంకు ఘాటు లేఖ.. "మారణకాండ ఆపండి"
ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా వేలాది జంతువులను బలి ఇవ్వనున్నారని సమాచారం ఉందని మేనకా గాంధీ పేర్కొన్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఈ చర్యలను ఆమె "సామూహిక మారణకాండ"గా అభివర్ణించారు. "జాతర పేరుతో జరుగుతున్న ఈ ఘటనలు దేశం మొత్తం గమనిస్తోందని.. ఇది మన సంస్కృతికి మచ్చ" అంటూ ఆమె లేఖలో తీవ్రంగా స్పందించారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాలు దేశంలో ఇప్పటికే అమలులో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాలు కఠినంగా అమలు కాకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జంతుబలులను నిషేధిస్తూ, కొబ్బరికాయలు వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారని ఉదాహరణలు చూపించారు. చట్టాలు ఉన్నా అమలు లేకపోతే ప్రయోజనం ఏమిటి?" అనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. జంతుబలులు కేవలం జంతువుల ప్రాణాలకే కాదు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని మేనకా గాంధీ హెచ్చరించారు.
మరోవైపు జాతరల సమయంలో మద్యం సేవించి వచ్చే కొందరు భక్తులు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు చిన్నపిల్లలు, యువతపై చెడు ప్రభావం చూపి, హింసను సహజంగా భావించే పరిస్థితి తీసుకువస్తాయని అన్నారు. సంస్కృతి పేరుతో హింసను ప్రోత్సహించడం ప్రమాదకరం" అని ఆమె స్పష్టం చేశారు. ఏ కారణం లేకుండా వేలాది మూగజీవాలను చంపడం అమానుషం అంటూ మేనకా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ సంస్కృతిలో జంతువులకు ప్రత్యేక స్థానం ఉందని, కరుణ, దయ మన సంప్రదాయాల మూలమని గుర్తు చేశారు. అలాంటి విలువలను విస్మరించి బలులు ఇవ్వడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. జంతువులు కూడా బాధను అనుభవించే జీవులేనని, వాటి ప్రాణాలను కాపాడడం మన బాధ్యత అని ఆమె అన్నారు. జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు, పండ్లు, పుష్పాలు వంటి ప్రతీకాత్మక సమర్పణలను ప్రోత్సహించాలని మేనకా గాంధీ సూచించారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, భక్తుల్లో అవగాహన కల్పిస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఇలాంటి మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వైద్యులు, విద్యావేత్తలు, యువత కూడా ఈ బలులను ఆపాలని కోరుతూ తనకు లేఖలు రాశారని ఆమె గుర్తుచేశారు. ముందుచూపు ఉన్న నాయకుడిగా సీఎం చంద్రబాబు ఈ అంశంపై జోక్యం చేసుకుని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని మేనకా గాంధీ కోరారు. ఈ నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలవొచ్చు అని ఆమె పేర్కొన్నారు.
ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మేనకా గాంధీ చర్యను ప్రశంసిస్తుండగా, మరికొందరు జాతర సంప్రదాయాలను మార్చకూడదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి ఆచారాలపై ప్రభావం చూపే అవకాశముంది.












Click it and Unblock the Notifications