ఏపీలో ట్రాఫిక్ చలాన్ల స్కాం..! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతి లేకున్నా ట్రాఫిక్ ఈ-చలాన్లు (traffic challan)వసూలు చేయడం ద్వారా రూ.37 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. అంతే కాకుండా ఒప్పందం గడువు ముగిసినా చలాన్లు వసూలు చేసిన డేటా ఎవాల్వ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది.
2018-2021 మధ్య ఏపీలో ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసి ఇచ్చేందుకు డేటా ఎవాల్వ్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ గడువు ముగిసిపోయినా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఏజెన్సీ అక్రమంగా రూ.37 కోట్ల మేర చలాన్లు వసూలు చేసి తమ ఖాతాలకు మళ్లించుకుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి అనుమతివ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై కింది కోర్టు సానుకూల నిర్ణయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. డేటా ఎవాల్వ్ సంస్థకు గతంలో మంజూరైన ఆర్బిట్రేషన్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీంతో ఇక ఆర్బిట్రేషన్ కు అవకాశం లేకుండా పోయింది. అలాగే అక్రమంగా వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించే విషయంపై అభిప్రాయం చెప్పేందుకు డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను మే 25కు వాయిదా వేసింది.














Click it and Unblock the Notifications