కేఎస్ఆర్టీసీలో నేటి నుంచి జెండర్ టికెటింగ్- ఉచితం దిశగా ముందడుగు
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఉచిత బస్సు ప్రయాణానికి సన్నాహాలు చేపట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అబ్జల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ దిశగా తొలి అడుగు పడుతోంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతోంది. అక్కడ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కానప్పటికీ.. ఉచిత బస్సు అమలు ఖాయమైంది.
దీంతో బస్సుల్లో లింగ ఆధారిత టికెట్ నమోదు వ్యవస్థను నేటి నుంచి ప్రవేశపెట్టింది. జెండర్ టికెటింగ్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. కేఎస్ఆర్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ నిశాంత్ ఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బస్సుల్లో కండక్టర్లు టికెట్లు జారీ చేసేటప్పుడు ప్రయాణికుల లింగాన్ని (పురుషుడా లేదా స్త్రీయా) తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్ (ఈటీఎం) పరికరాల మార్పులు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ నుంచి ఎక్స్ ప్రెస్ బస్ సర్వీస్ వరకూ రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారనే విషయాన్ని రియల్ టైమ్ లో తెలుసుకోవడం కోసమే జెండర్ టికెటింగ్ వ్యవస్థను కేఎస్ఆర్టీసీ అమలులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉచిత బస్సు ప్రయాణానికి అయ్యే వ్యయం ఎంత అవుతుందనేది సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ఏ ఇతర రాష్ట్రానికో అధ్యయనం కోసం వెళ్లనక్కర్లేదని యాజమాన్యం అభిప్రాయపడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, కండక్టర్లు సరైన వివరాలను నమోదు చేసేలా చూడాలని కేఎస్ఆర్టీసీ ఆదేశించింది. ప్రజారవాణా సేవలను వినియోగించుకుంటున్న మహిళా ప్రయాణికుల సంఖ్యపై కచ్చితమైన డేటాను సేకరించడమేనని కేఎస్ఆర్టీసీ పేర్కొంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కేఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ రాయితీలను ఎలా భరిస్తుందనే విషయంపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనిపై రవాణా మంత్రిత్వ శాఖ ఓ స్పష్టమైన ప్రకటన చెయ్యొచ్చు.












Click it and Unblock the Notifications