డీజే దెబ్బ.. సౌండ్కు 140 ప్రాణాలు బలి!
సాధారణంగా పెళ్లిళ్లలో డీజే శబ్దాలు మనుషులకే చిరాకు కలిగిస్తుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ శబ్ధాలు ఏకంగా మూగజీవాల ప్రాణాలనే బలితీసుకున్నాయి. దరియాపూర్ గ్రామానికి చెందిన సాబిర్ అలీ అనే రైతు నిర్వహిస్తున్న పౌల్ట్రీఫామ్ సమీపం నుంచి ఓ వివాహ ఊరేగింపు వెళ్తున్న సమయంలో ఈ ఊహించని ఘటన జరిగింది. భారీ శబ్ధంతో మోగుతున్న డీజే మ్యూజిక్ కారణంగా ఆ ఫామ్లోని కోళ్లు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. సుమారు 140 కోళ్లు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాయి.
వద్దని వేడుకున్నా వినని నిర్లక్ష్యం
కోళ్ల ఫామ్ యజమాని సాబిర్ అలీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డీజే శబ్ధాలకు కోళ్లు విలవిలలాడటం చూసి అతను వెంటనే డీజే ఆపరేటర్ కవి యాదవ్ దగ్గరకు వెళ్లి శబ్ధం తగ్గించాలంటూ వేడుకున్నాడు. భారీ శబ్ధం వల్ల తన కోళ్లకు ప్రమాదం వాటిల్లుతుందని మొరపెట్టుకున్నా.. ఆపరేటర్ ఏ మాత్రం కనికరం చూపలేదు. తగ్గించకుండా సౌండ్ పెంచి పాటలు ప్లే చేస్తూ ఊరేగింపును కొనసాగించాడు. ఈ నిర్లక్ష్యం వల్ల మరుసటి రోజు ఉదయానికి 140 కోళ్లు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ రైతు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు.

పోస్టుమార్టంలో తేలిన షాకింగ్ నిజాలు
ఈ ఘటనపై అనుమానం వచ్చిన సాబిర్ అలీ పోలీసులను ఆశ్రయించగా.. వారు పశువైద్యులతో విచారణ జరిపించారు. చనిపోయిన కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ల బృందం విస్తుపోయే నివేదికను ఇచ్చింది. ఆ కోళ్లన్నీ ఎటువంటి వ్యాధి వల్ల కాకుండా కేవలం భారీ శబ్ధాల వల్ల కలిగిన గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. పక్షుల గుండె చాలా సున్నితంగా ఉంటుందని.. డీజే వంటి కృత్రిమమైన భారీ శబ్ధాలు వాటి ప్రాణాలకే ముప్పని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
పోలీసుల యాక్షన్.. డీజే ఆపరేటర్ అరెస్ట్
ఈ కేసును సీరియస్గా తీసుకున్నబల్దిరాయ్ పోలీసులు శబ్ధ కాలుష్య నియమాలను ఉల్లంఘించినందుకు డీజే వాహనాన్ని సీజ్ చేశారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజే యజమాని కవి యాదవ్ను అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరచగా.. అతను ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యాడు. మూగజీవాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications