బండి సంజయ్ పోక్సో కేసు.. బాధిత బాలిక, ఆమె కుటుంబవివరాలు బయటపెట్టిన వారిపై కేసులు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాధిత బాలిక, ఆమె కుటుంబంపై జరుగుతున్న ప్రచారం విషయంలో పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు .బాధితురాలైన మైనర్ బాలిక పేరు, ఫోటోలు, వీడియోలు, కుటుంబ వివరాలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియాలో పోక్సో కేసు బాదితురాలిపై ప్రచారం
బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం తీవ్ర నేరమని, ఇలాంటి చర్యలు బాధితుల జీవితాలను దీర్ఘకాలికంగా దెబ్బతీస్తాయని పోలీసులు గుర్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనవసరమైన, అనైతిక ప్రచారం జరుగుతోందని గుర్తించారు. బాలిక ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల సమాచారం వంటి సున్నితమైన వివరాలు షేర్ చేయడం వల్ల బాధితురాలు మరియు ఆమె కుటుంబం తీవ్రమైన మానసిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

వారిపై కేసులు నమోదుకు రంగం సిద్ధం
ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 74కింద మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని స్పష్టమైన నిబంధన ఉంది. ఈ సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో బాధితులకు సంబంధించి ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేసినా చర్యలు తప్పవన్నారు.
అలా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిక
యూజర్ ఐడీలు, లింకులు సేకరించి సంబంధిత అధికారులకు అందజేస్తున్నారు. పోలీసులు సోషల్ మీడియా యూజర్లందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. పోక్సో కేసుల్లో బాధితులైన పిల్లల వివరాలు, ఫోటోలు, వీడియోలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని, అలా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు బాధితుల గోప్యతను దెబ్బతీయడమే కాకుండా, వారి భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు.
సోషల్ మీడియాపై పోలీసుల మానిటరింగ్
పోలీసులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలు ఇప్పటికే సోషల్ మీడియాలో కొంత ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొందరు ఇలాంటి కంటెంట్ను షేర్ చేస్తున్నట్లు పోలీసులు గమనించారు. బాధితుల రక్షణ కోసం చట్టం అన్ని వేళలా ఉంటుందని, సమాజం కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాను సైతం పోలీసులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications