కేంద్ర మంత్రిగా రాఘవ్ చడ్ఢా?
చీపురు తిరగేసి కొడితే ఇలాగే ఉంటుంది!" - ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో వినిపిస్తున్న హాట్ కామెంట్ ఇది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న రాజ్యసభ ఎంపీల బృందాన్ని చీల్చి, మెజారిటీ సభ్యులతో బీజేపీలో విలీనం చేసిన రాఘవ్ చడ్ఢా.. ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. నిన్నటి వరకు విపక్ష బెంచీల్లో కూర్చుని ప్రభుత్వాన్ని నిలదీసిన చడ్ఢా, త్వరలోనే మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ప్రచారం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చదువుకుని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా పొందిన రాఘవ్ చడ్ఢా.. రాజకీయాల్లోకి రావడం ఒక సంచలనం. కేవలం 33 ఏళ్లకే రాజ్యసభలో అడుగుపెట్టి అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. పంజాబ్లో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించి, రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఎక్కడైతే తన 15 ఏళ్ల యవ్వనాన్ని ధారపోశారో, అక్కడే అవమానం ఎదురవ్వడం చడ్ఢా రూటు మార్చడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

"తప్పుడు పార్టీలో సరైన వ్యక్తిని": ఆరోపణల వెనుక అసలు నిజం!
ఇటీవల రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి చడ్ఢాను ఆప్ తొలగించినప్పుడు, ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాఘవ్ స్పందిస్తూ.. "నాపై స్క్రిప్టెడ్ దాడి జరుగుతోంది. ఒకే భాష, ఒకే ఆరోపణలతో నన్ను బద్నాం చేస్తున్నారు. అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందని భ్రమపడుతున్నారు" అని ఎక్స్ (X) వేదికగా ఫైర్ అయ్యారు. "నేను నా రక్తాన్ని, చెమటను ధారపోసి పెంచిన పార్టీ ఇప్పుడు సిద్ధాంతాలను వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోంది" అంటూ ఆప్ అధిష్టానంపై గర్జించారు.
రాజ్యసభలో భారీ విలీనం: పక్కా స్కెచ్!
రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం 2/3 వంతు సభ్యులు విడిపోతే వారిపై అనర్హత వేటు పడదు. దీన్ని పక్కాగా అమలు చేసిన రాఘవ్ చడ్ఢా.. తనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ, స్వాతి మలివాల్ వంటి హేమాహేమీలను బీజేపీ వైపు తిప్పుకున్నారు. ఈ ఏడుగురి సంతకాలతో కూడిన లేఖ ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ వద్ద ఉంది. అంటే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక బీజేపీలో అంతర్భాగమే!
కేంద్ర మంత్రిగా రాఘవ్? ప్రశ్న నుంచి పరిష్కారం వైపు!
ప్రజా సమస్యలపై పార్లమెంటులో వాడివేడి ప్రసంగాలు చేసిన రాఘవ్ చడ్ఢాకు, ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే 'కేంద్ర మంత్రి' పదవి దక్కబోతోందనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, కేజ్రీవాల్ టీమ్ నుంచి మోదీ టీమ్లోకి వెళ్లిన అత్యంత శక్తివంతమైన నేతగా చడ్ఢా నిలుస్తారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన రాఘవ్ చడ్ఢా రాజకీయ జీవితం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇది ఆయన ఎదుగుదలకు సోపానమా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి ప్రారంభమా? అన్నది కాలమే నిర్ణయించాలి.












Click it and Unblock the Notifications