ఇరాన్ యుద్ధం వేళ భారత్-అమెరికా భారీ డీల్!
ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రక్షణ రంగంలో భారత్, అమెరికా దేశాలు చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పశ్చిమ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల చమురు, సహజ వాయువు సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేసింది. అమెరికన్ కంపెనీ 'GE ఏరోస్పేస్', భారత ప్రభుత్వ రంగ సంస్థ 'HAL' మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత వైమానిక దళానికి సరికొత్త శక్తిని ఇవ్వనుంది.
ఈ భారీ డీల్ ప్రకారం.. భారత వైమానిక దళానికి చెందిన 'తేజస్'యుద్ధ విమానాల ఇంజిన్ల మరమ్మత్తు కోసం భారత్లోనే ఓ ప్రత్యేక డిపో సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు F404-IN20 జెట్ ఇంజిన్ల సహ-ఉత్పత్తిపై సాంకేతిక చర్చలు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు బదిలీ చేయనున్నారు. ఈ శక్తివంతమైన ఇంజిన్లు భవిష్యత్తులో రాబోయే తేజస్ Mk2, AMCA వంటి స్టీల్త్ ఫైటర్ విమానాలకు కీలకంగా మారనున్నాయి.

ఈ ఒప్పందం వల్ల ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఇంజిన్ డిపో నిర్వహణ, కార్యకలాపాలు, యాజమాన్యం పూర్తిగా భారత వైమానిక దళం వద్దే ఉంటుంది. అదే సమయంలో GE ఏరోస్పేస్ సంస్థ సాంకేతిక నైపుణ్యం, శిక్షణ, అవసరమైన విడిభాగాలను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తుంది. ఇది భారత వైమానిక దళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా 'మేక్ ఇన్ ఇండియా' విధానానికి పెద్దపీట వేస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత 40 ఏళ్లుగా భారత విమానయాన రంగంలో GE ఏరోస్పేస్ భాగస్వామిగా ఉంది. ఇప్పటికే భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక, P-81 నిఘా విమానాలు, అపాటీ హెలికాప్టర్లలో ఈ సంస్థ తయారు చేసిన ఇంజిన్లనే వాడుతున్నారు. ప్రస్తుత తాజా ఒప్పందం వల్ల తేజస్ విమానాల లభ్యత మరింత పెరుగుతుందని.. తద్వారా భారత్ తన గగనతల భద్రతను మరింత పకడ్బందీగా నిర్వహించుకోవచ్చని GE సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications