భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ ముష్కరులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7-10 మధ్య ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది ఉగ్ర మూకలను హతమార్చింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత్ నుంచి ఏప్రిల్ లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో వీళ్లంతా పాల్గొననున్నారు. దీంతో పాటు లాహోర్, కర్తార్ పూర్, ఎమినాబాద్, ఫరూఖా బాద్, నంకానా సాహిబ్ వంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ ఏటా వీరి కోసం ప్రత్యేక 'జథా' వీసాలు అందిస్తోంది.
ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్న బైశాఖి ఉత్సవాల్లో భాగంగా భారత్ నుంచి దాదాపు 3 వేల మంది సిక్కులు పాకిస్థాన్ కు బయల్దేరుతారు. ఏప్రిల్ 14న పంజాబ్ ప్రావిన్స్ లోని హసన్ అబ్దాల్ ప్రాంతంలోని గురుద్వారా పంజా సాహిబ్ లో బైశాఖి పౌర్ణమి కార్యక్రమం జరగనుంది. ఈ బైశాఖి పండుగను వైశాఖ నెల ప్రారంభంలో తొలి రోజున నిర్వహిస్తారు. దీనిని హార్వెస్ట్ సీజన్ కు తొలి అడుగుగా భావిస్తారు. ప్రతి ఏటా గురుద్వారా పంజా సాహిబ్ ను రంగులతో అలంకరిస్తారు. భక్తులు పసుపు పచ్చని టర్బన్ లు ధరించి ఇక్కడికి చేరుకుంటారు.

బైశాఖి పూర్ణిమ, ఖల్సా జన్మదిన్ సంబరాల్లో భాగంగా పంజాబ్ ప్రావిన్స్ రిలీజియస్ ఎఫైర్స్ మినిస్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు లాహోర్ లోని పంజాబ్ హోమ్ డిపార్ట్ మెంట్ హై- లెవల్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రావిన్షియల్ మినిస్టర్ ఖవాజా సల్మాన్ రఫిఖీ, ప్రావిన్షియల్ మినిస్టర్ అండ్ పర్దాన్ ఆఫ్ పాకిస్థాన్ సిక్కు గురుద్వారా పర్బందఖ్ కమిటీ సర్దార్ రమేశ్ సింగ్ అరోరా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏప్రిల్ 10 న భారత్ నుంచి పాకిస్థాన్ కు 3 వేల మంది సిక్కు భక్తులు వస్తారని అంచనాకు వచ్చారు. భక్తులు నానక్ రామ్ సాహిబ్, ఫరూఖాబాద్, షేక్ పుర్, ఖర్తార్ పూర్, ఎమినాబాద్, లాహోర్ లోని మతపరమైన ప్రదేశాల్లోనూ పర్యటించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications