ర్యాపర్ టు ప్రైమ్ మినిస్టర్ సీట్: స్ట్రక్చరల్ ఇంజినీర్ స్టూడెంట్ ప్రస్థానం
మన పొరుగుదేశం నేపాల్ చరిత్రలో ఓ నూతన అధ్యాయం మొదలైంది. ఆ దేశ రాజకీయాలను ఓ యువకుడు సమూలంగా మార్చివేయగలిగాడు.. ఒంటిచేత్తో. ఓ కెరటంలా దూసుకొచ్చాడు. ఏకంగా ప్రధానమంత్రి పదవిని అధిరోహించాడు. దేశ రాజకీయాల్లో నాయకత్వానికి తెరలేపాడు. ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన అతి పిన్న వయస్కుడు కావడం నేపాల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేపాల్ కు ఆయన 47వ ప్రధాని.
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన 35 సంవత్సరాల బాలేంద్ర షా కొద్దిసేపటి కిందటే నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఈ అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. ఖాఠ్మాండులోని శీతల్ నివాస్లో రాష్ట్రపతి రామచంద్ర పౌఢెల్ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. దేశం పట్ల విధేయతతో బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శంఖారావం, స్వస్తిశాంతి, అష్టమంగళ మంత్రాలు వంటి సంప్రదాయ అంశాలతో సాగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవం సాగింది. నలుపు దుస్తులు, సన్గ్లాసెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు బాలేంద్ర.
నేపాల్ లోక్ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 275 సీట్లలో దాదాపు మూడింట రెండు వంతులను గెలుచుకుంది రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. ఒకప్పుడు ర్యాప్ కళాకారుడిగా ప్రాచుర్యం పొందాడు బాలేంద్ర. ఖాఠ్మాండు మేయర్గా పనిచేశాడు. వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా. గత ఏడాది సెప్టెంబర్లో జెన్ జీ నిరసనకారులకు బహిరంగంగా మద్దతు పలికారు. వారి గొంతును బలంగా వినిపించాడు. నాటి రక్తపాతం తర్వాత అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఈ నెల ప్రారంభంలో మద్యంతర ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ప్రభంజనం సృష్టించింది. 182 సీట్లు గెలుచుకొని పార్లమెంట్లో అతిపెద్ద శక్తిగా అవతరించింది. ర్యాపర్ నుండి రాజకీయవేత్తగా మారిన బాలేంద్ర షా ప్రస్థానం ఖాఠ్మాండు మేయర్గా ఆరంభమైంది. సింహ దర్బార్లోని సమాఖ్య వ్యవస్థను తరచుగా సవాల్ చేస్తూ, తన నిక్కచ్చి వైఖరితో షా గుర్తింపు పొందారు. ఖాఠ్మాండు పరిపాలనా హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, ప్రజా వివాదాలలో ధైర్యంగా జోక్యం చేసుకోవడం ఆయన ప్రత్యేకతను చాటింది.












Click it and Unblock the Notifications