పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, నిప్పుల కొలిమిలా మారిన పల్నాడు..
రాష్ట్రంలో భానుడు సెగలు గక్కుతున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయమే మొదలవుతున్న ఎండ తీవ్రత, మధ్యాహ్నానికి ప్రచండ రూపం దాల్చుతోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవ్వడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఈ వేసవిలోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ప్రస్తుత సీజన్ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో పాదరసం 45 డిగ్రీల మార్కును దాటేసింది. అలాగే 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవ్వడం చూస్తుంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు!
తీవ్రమైన హీట్ వేవ్ (ఎండ తీవ్రత) ప్రభావం మనుషులపైనే కాకుండా విద్యుత్ వ్యవస్థలపై కూడా పడుతోంది. ఎండల వేడిని తట్టుకోలేక రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ పరికరాలు దెబ్బతింటుండగా, తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అబ్బూరు రోడ్డులోని 132 కేవీ సబ్స్టేషన్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ శబ్దంతో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది.
తీవ్రమైన ఎండ వేడిమి, అంతర్గతంగా పెరిగిన ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ట్రాన్స్ఫార్మర్ పేలిన సమయంలో దానిలోని వేడి ఆయిల్ (నూనె) ఒక్కసారిగా పైకి చిమ్మింది. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు విద్యుత్ సిబ్బందిపై ఆ వేడి ఆయిల్ పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సత్తెనపల్లి పట్టణంలోని కొండారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
స్తంభించిన విద్యుత్ సరఫరా.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
ఈ పేలుడు ధాటికి సబ్స్టేషన్లోని సిస్టమ్ ఒక్కసారిగా ట్రిప్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు పైస్థాయి నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. ఒకవైపు 45 డిగ్రీలకు పైగా మండుతున్న ఎండలు, మరోవైపు కరెంట్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు.
యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడం, మరోవైపు వేడి గాలి కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications