అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్!
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయాలను, ఇంధన మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే పరిస్థితి రావడంతో అమెరికా రంగంలోకి దిగింది. హోర్ముజ్ జలసంధి విషయంలో అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్న వ్యూహాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎద్దేవా చేశారు.
అమెరికాపై పాక్ మంత్రి కామెంట్స్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా అమెరికాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "యుద్ధం లక్ష్యం ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని తెరిపించడం అని చెబుతున్నారు.. కానీ అది ఇప్పటికే తెరిచే ఉంది కదా!" అంటూ పాక్ మంత్రి సెటైర్లు వేశారు. అమెరికా తన యుద్ధ లక్ష్యాలను మాటిమాటికీ మారుస్తోందని.. అంతర్జాతీయ సమాజంలో అయోమయం సృష్టిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. ఓ వైపు శాంతి చర్చల పేరుతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించాలని చూస్తుంటే.. మరోవైపు ఇలాంటి కామెంట్స్ చేయడం దౌత్యపరంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్ జలసంధి ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ఎల్ఎన్జీలో సుమారు 20 శాతం ఈ మార్గం నుంచే వెళ్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. సాధారణంగా రోజుకు 120 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో మార్చి నెలలోని 25 రోజుల్లో కేవలం 155 నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అంటే దాదాపు 95 శాతం తగ్గుదల నమోదైంది. ఇరాన్ ఈ మార్గంపై కఠినంగా నియంత్రణ విధించడంతో ప్రపంచ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అగ్రరాజ్యం ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్
యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా 15 అంశాలతో కూడిన ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచింది. ఇందులో ఆంక్షల సడలింపు, అణు కార్యక్రమాలపై నియంత్రణ, హోర్ముజ్ జలసంధిని పునరుద్ధరించడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ సార్వభౌమాధికారానని గుర్తించాలని.. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications