బెంగళూరు రూపురేఖలను సమూలంగా మార్చేసే బిగ్ ప్రాజెక్ట్- బిడదిలో AI Township
సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీని నెలకొల్పబోతోంది. ఏఐ ఆధారిత 'గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (GBIT)' ను బిడదిలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. సుమారు 9,000 ఎకరాల్లో ఈ ఏఐ ఆధారిత టౌన్ షిప్ ఏర్పాటు కానుంది.
బెంగళూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మైసూరు రోడ్డులో ఉంటుంది బిడది. ఇక్కడ 9,000 ఎకరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టౌన్ షిప్ ఏర్పాటు కానుంది. Work-Live-Play కాన్సెప్ట్ తో దీన్ని అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారికంగా వెల్లడించారు. రామనగర కలెక్టర్ కార్యాలయంలో దీనిపై సమీక్ష సైతం నిర్వహించారు. అన్ని నిబంధనలకు లోబడే టౌన్షిప్ను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బెంగళూరుకు రెండో వాణిజ్య కేంద్రంగా ఈ AI సిటీ ఆవిర్భవిస్తుందని డీకే పేర్కొన్నారు. ఈ టౌన్ షిప్ వల్ల రామనగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, బెంగళూరు తర్వాత ఆ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తుందని అన్నారు. ఈ టౌన్ షిప్ లో 2,000 ఎకరాలకు పైగా AI ఆధారిత పరిశ్రమలు, అనుబంధ యూనిట్ల కోసం కేటాయించినట్లు ఆయన వివరించారు. 300 మీటర్ల వెడల్పు గల బిజినెస్ కారిడార్ ను నిర్మిస్తామని, ఎస్టీఆర్ఆర్, ఎన్ హెచ్ -209, ఎన్ హెచ్ -275, నైస్ రోడ్డు వంటి ప్రధాన రహదారులను దీనితో అనుసంధానిస్తామని చెప్పారు.
అలాగే- ఐటీ, ఏఐ, సర్వీస్ రంగాలలో ఈ టౌన్ షిప్ లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక యువతకు అవకాశాలు కల్పించడానికి లోకల్ ఫస్ట్ అనే విధానాన్ని ఇందులో అమలు చేస్తామని తెలిపారు. సొంత రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది యువతకు ఇక్కడ కొత్త ఉద్యోగాలు లభిస్తాయని, AI-ఆధారిత పరిశ్రమల కోసం వారిని సిద్ధం చేసే నైపుణ్య కేంద్రాలు ఇక్కడ ఏర్పాటవుతాయని తెలిపారు.
బిడదికి ఆర్థిక కార్యకలాపాలను మార్చడం ద్వారా ఈ ప్రాజెక్ట్ బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గిస్తుందనీ డీకే వ్యాఖ్యానించారు. దీన్ని అనుసంధానిస్తూ రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, వాక్-టు-వర్క్ నెట్ వర్కింగ్ రోడ్స్ అందుబాటులో తెస్తామని అన్నారు. 1,100 ఎకరాలకు పైగా పార్కులు, బహిరంగ స్థలాలు ఉండటంతో గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దేశంలోనే అత్యంత పచ్చని పట్టణ ప్రాంతాలలో ఒకటిగా మారుతుందని అన్నారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ 2006లో అప్పటి ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ప్రతిపాదించారు.ఆ తర్వాత డెవలపర్ DLF దీని నుంచి వైదొలిగింది. ఇప్పుడు మళ్లీ తెరమీదికి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. మార్చిలో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టౌన్షిప్ తొమ్మిది గ్రామాలలో దాదాపుగా 9,000 ఎకరాలలో నిర్మితమౌతుంది. ఇందులో 6,731 ఎకరాల ప్రైవేట్ భూమి, 750 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,012 ఎకరాల జల వనరులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications