AI ని గుడ్డిగా నమ్మితే.. కట్ట కట్టుకుని పోతారు
సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. AI వినియోగంపై తీవ్ర హెచ్చరికలు ఇచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను గుడ్డిగా నమ్మొద్దని, వెనుకా ముందు ఆలోచించకుండా దీనిపై ఆధారపడటం సరికాదని తేల్చి చెప్పారు. AI.. ఇప్పటికీ లోపభూయిష్టంగా ఉందని ఆయన అన్నారు. దీని వినియోగం ప్రమాదకరం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ మాట్లాడారు. AI లో ప్రస్తుతం కొనసాగుతున్న భారీ పెట్టుబడులు ఒక బబుల్ను పోలి ఉన్నాయని, అది ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ బబుల్ ప్రభావం గూగుల్తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి కంపెనీపై పడుతుందని హెచ్చరించారు. AI ని అదనపు సమాచార వనరుగా మాత్రమే ఉపయోగించాలని, దానిపై పూర్తిగా ఆధారపడకూడదని సూచించారు.

విశ్వసించదగ్గ, నమ్మకమైన సమాచారం కోసం ప్రజలు ఇప్పటికీ గూగుల్ సెర్చ్ను ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గూగుల్ ప్రొడక్టులు అన్నీ కూడా ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తాయని పిచాయ్ పేర్కొన్నారు. AI టూల్స్ ఇప్పటికీ తరచుగా తప్పుడు సమాధానాలు ఇస్తున్నాయని, అవి ఇచ్చే అవుట్పుట్ను గుడ్డిగా విశ్వసించకూడదని అన్నారు. సృజనాత్మక పనుల్లో AI చాలా ఉపయోగకరంగా ఉంటుందే కానీ దాని పరిమితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
యూజర్లు AI టూల్స్ను తెలివిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సుందర్ పిచాయ్ చెప్పారు. ఏ పరిస్థితుల్లో AI ని ఎంతవరకు విశ్వసించాలో తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. గూగుల్ ప్రధాన బలం చిప్, డేటా, AI మోడల్స్, రీసెర్చ్, సొంత సాంకేతికతో వివిధ రకాల టూల్స్ ను అభివృద్ధి చేయడమేనని పిచాయ్ వివరించారు. ఇది AI లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో గూగుల్కు ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications