AI గర్ల్ఫ్రెండ్తో అధికారిని చంపే కుట్ర! దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ టెక్నాలజీ పనులను సులభతరం చేస్తున్నప్పటికీ.. దాని దుర్వినియోగం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ తాజా ఉదంతం నిరూపించింది. రష్యాకు చెందిన గూఢచార సంస్థ FSB జరిపిన దర్యాప్తులో ఓ సంచలనాత్మక కుట్ర వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ గూఢచార సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారిని హనీట్రాప్ చేసి 'AI గర్ల్ఫ్రెండ్'ను సాధనంగా ఉపయోగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. రష్యా అధికారికి బహుమతిగా పంపబడిన బీర్ బాటిళ్లలో అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిపినట్లు FSB గుర్తించింది. అయితే ఈ కుట్రలో ఏఐ పాత్ర ఏమిటో తెలుసుకుందాం.
ఏఐ పాత్ర ఇదే.. !
రష్యా అధికారి తన కథనాన్ని ఇలా వివరించారు. కొన్ని నెలల క్రితం, ఆయనకు ఒక డేటింగ్ యాప్లో 'పొలినా' అనే అమ్మాయి పరిచయమైంది. వీరిద్దరి మధ్య సంభాషణ త్వరలోనే టెలిగ్రామ్ యాప్కు మారింది. పొలినా అతనికి తన జిమ్ ఫోటోలు, వీడియోలు పంపేది. అవన్నీ దాదాపు ఒకేలా ఉండేవి. చాలా నెలలు మాట్లాడిన తర్వాత, పొలినా అతనికి ఒక గిఫ్ట్ను పంపాలనుకుంటున్నట్లు, అది తన స్నేహితుడి ద్వారా పంపబడుతుందని చెప్పింది.

పొలినా ఒక మనిషి కాదు... AI బాట్!
FSB జరిపిన లోతైన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. 'పొలినా' అనే అమ్మాయి నిజంగా లేదు. ఆ మొత్తం ప్రొఫైల్ను ఉక్రెయిన్ గూఢచార సంస్థ GUR సృష్టించింది. పొలినా ఫోటోలు, వీడియోలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించబడ్డాయి. అధికారిని ట్రాప్లో పడేయడానికి AI సృష్టించిన ఒక బాట్ మాత్రమే పొలినా.
అధికారి ప్రాణాలను కాపాడిన FSB
గిఫ్ట్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్కు చెందినవాడు. ఉక్రెయిన్ ఏజెన్సీ అతనికి 5,000 డాలర్ల డబ్బు ఆశ చూపింది. అతడు రెండు ప్యాకెట్ల బ్రిటీష్ బీర్ను అధికారికి అందించేందుకు ప్రయత్నించగా, FSB అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ బీర్ బాటిల్స్ను పరీక్షించగా.. వాటిలో కోల్చిసిన్, టి-బ్యూటైల్ బైసైక్లోఫాస్ఫేట్ అనే రెండు అత్యంత ప్రమాదకరమైన విషాలను కలిపినట్లు తేలింది. అధికారి ఆ విషాన్ని సేవించి ఉంటే, కేవలం 20 నిమిషాల్లో బాధాకరమైన మరణం సంభవించేదని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన AI టెక్నాలజీని యుద్ధాలు, నేరపూరిత చర్యలలో ఎంత ప్రమాదకరంగా దుర్వినియోగం చేయవచ్చో ప్రపంచానికి తెలియజేసింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications