సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థానాల్లో పాగా వేస్తామని భావించినా చివరకు 9 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయినా.. ఓటు శాతం పెరిగిందని అన్నారు. గతంలో కన్నా 6శాతం ఓట్లు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలుపు గెలుపుకాదన్న ఆయన.. అది నామమాత్ర విజయమేనని అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో కేవలం 10 వేల ఓట్ల మెజార్టీతో సాధించిన విజయం అసలు విజయమే కాదని చెప్పారు.
దేశంలో ప్రధాని మోడీ వేవ్ కనిపించిందన్న కేటీఆర్... ఆ కారణంగానే బలహీనమైన అభ్యర్థులున్న స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధ్యమైందని చెప్పారు. ఆదిలాబాద్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదని అన్నారు. రాష్ట్రంలో 16సీట్లు గెలవాలన్న పట్టుదలతో పనిచేశామని, ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది తమకు స్పీడ్ బ్రేకరేనన్న కేటీఆర్ టీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తమ్మీద సీట్లు తగ్గినా ఓట్లు పెరిగాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.