కర్నాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఎవరు? మీ కామెంట్ ఏంటి?
కర్నాటకానికి తెరపడింది. ఐదు రోజుల పాటు చర్చలు, వాయిదాల తర్వాత ఎట్టకేలకు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. గత శుక్రవారం నుంచి హైడ్రామా కొనసాగడంతో ఒక దశలో అసలు బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో స్పీకర్ రమేష్ కుమార్ ఎట్టకేలకూ మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. తమ సభ్యులెవరూ సభకు డుమ్మా కొట్టకుండా బీజేపీ జాగ్రత్తపడింది. మధ్యాహ్నం మూడింటి వరకు సీఎం కుమారస్వామి సభలో అడుగుపెట్టకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకూ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య తాము విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసగిస్తానని స్పీకర్కు నోటీసులు పంపిన ముఖ్యమంత్రి కుమారస్వామి సాయంత్రం ఆరింటికి చర్చకు సిద్ధమయ్యారు. గంటన్నర పాటు సాగిన సుదీర్ఘ ప్రసంగం అనంతరం స్పీకర్ మూజువాణి ఓటింగ్కు సిద్ధమయ్యారు. అయితే ప్రతిపక్ష బీజేపీ డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టడంతో దానికి అంగీకరించారు. తొలుత అధికార పార్టీ మద్దతుదారులను అనంతరం బీజేపీ సభ్యులను లెక్కించారు. ఓటింగ్ సమయంలో 204 మంది సభకు హాజరుకాగా విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో కుమారస్వామి నేతృత్వంలోని అధికార జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ అనంతరం రాజ్ భవన్కు వెళ్లిన సీఎం కుమారస్వామి గవర్నర్ వాజూ భాయి వాలాకు రాజీనామా అందజేశారు. దాన్ని వెంటనే ఆమోదించిన గవర్నర్ తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కుమారస్వామిని కోరారు.
నిజానికి కర్నాటకలో బీజేపీకి అధికారం దక్కకూడదన్న ఉద్దేశంతో రాజకీయ శత్రువులైన కాంగ్రెస్ - జేడీఎస్లు చేతులు కలిపాయి. అయితే అతితక్కువ సీట్లు సాధించిన కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడంపై కాంగ్రెస్ సీనియర్లు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ కూర్పులో కుమారస్వామి పక్షపాత వైఖరి ప్రదర్శించారు. కీలక పోర్ట్ ఫోలియోలను అనుచరులకు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తికి కారణమైంది. ఇక ఉత్తరప్రాంత జిల్లాల నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వార్చింది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నిక్లలో కాంగ్రెస్, జేడీఎస్లు ఘోర పరాజయం పాలవడం, అదే సమయంలో బీజేపీ ఆపరేషన్ కమల ద్వారా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లేందుకు కారణమైంది. మొత్తమ్మీద అధికారం చేపట్టిన 13 నెలలకే కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీనికి కారకులు ఎవరని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.