టెన్త్ లో 54 శాతం మార్కులు- సీన్ కట్ చేస్తే IIT బోంబేలో సీటు...!
మన దేశంలో ఐఐటీ (IIT) సీటు ఓ కల. స్కూలు దశ నుంచే దీన్ని సాధించేందుకు విద్యార్ధులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. రాత్రీ పగలూ చదువుతారు. అయినా లక్షల మందిలో కొందరే ఐఐటీలో ప్రవేశాలు పొందుతూ ఉంటారు. వీరిలో అదృష్టం కలిసి వచ్చి సీటు సంపాదించే వారు నూటికో, కోటికో ఒకరు మాత్రమే ఉంటారు. అయితే అదృష్టం కలిసి వచ్చిందో లేదో తెలియదు కానీ ఓ సగటు విద్యార్ధికి మాత్రం తన పట్టుదలే ఐఐటీ సీటు సంపాదించి పెట్టింది. అతని పేరే జైనేంద్రజీత్.
పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన జైనేంద్ర జీత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బోర్డు పరీక్షలకు ముందు సుమారు 40-50 రోజులు మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తరగతులకు కూడా వెళ్లలేకపోయాడు. ప్రిపరేషన్లో వెనుకబడ్డాడు. చివరికి ఎలాగోలా పదో తరగతిలో 54శాతం స్కోరుతో బయటపడ్డాడు. అతని స్నేహితులు మాత్రం 80 శాతం నుండి 98 శాతం మధ్య స్కోర్లు సాధించారు. తన స్నేహితులందరిలో కెల్లా తనకే అత్యంత తక్కువ మార్కులు వచ్చాయి. అతన్ని ఎక్కువగా బాధపెట్టింది కేవలం స్కోరు మాత్రమే కాదు, జనం, తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం. అప్పుడు ఏదో మార్పు వచ్చింది. జైనేంద్రజీత్ తనకున్న సమయాన్ని, చదవాల్సిన సిలబస్ ను ప్లాన్ చేసుకున్నాడు. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించేశాడు.

రోజుకు 10 గంటలు చదవడం అలవాటుచేసుకున్నాడు. అయినా గణిత ప్రశ్నలు పరిష్కారమయ్యేవి కావు, ఫిజిక్స్ను చూడగానే భయమేసేది. కెమిస్ట్రీలోని రియాక్షన్లు గుర్తుండేవి కావు. గంటల తరబడి చదివినా ఫలితం లేదనిపించేది. అయినా వదల్లేదు.
క్లాస్ కు వెళ్ళకముందే ఆ రోజు పాఠాల్ని యూట్యూబ్ లో చూసి అర్ధం చేసుకునేవాడు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. సబ్జెక్టుల వారీగా వాటిని విభజించుకుని, ప్రతిరోజూ నిర్దిష్ట పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాడు. ఒక అధ్యాయాన్ని పూర్తి చేయగానే గత సంవత్సరపు ప్రశ్నపత్రాలను సాధన చేసేవాడు. అవి జేఈఈ ప్రశ్నల వెనుక సరళిని, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడ్డాయి. ఈ మార్పు చివరికి ఫలితాలలో కనిపించింది. జైనేంద్రజీత్ జేఈఈ మెయిన్ 2023లో 99.98 పర్సంటైల్, జేఈఈ అడ్వాన్స్డ్ (JEE) 2023లో ఆల్ ఇండియా ర్యాంక్ 349 సాధించి, ఐఐటి బోంబేలో కంప్యూటర్ సైన్స్లో సీటు సంపాదించాడు.














Click it and Unblock the Notifications