గ్రూప్-3 అభ్యర్థులకు గుడ్న్యూస్: మళ్లీ అదనంగా కలిసిన పలు పోస్టులు
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన వెలువరించింది. మొదట 1363 పోస్టులతో గత డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1375కి పెరిగాయి.
తాజాగా, నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మరోసారి 13 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1388కి పెరిగింది.
కాగా, గ్రూప్ 3 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు గ్రూప్ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష పత్రం ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్-4 పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్తో దొరికిన అభ్యర్థి : తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాస్తూ సెల్ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్నగర్లోని సక్సెస్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు పకడ్బంధీగా తనిఖీలు చేసినా.. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ ఎలా తీసుకెళ్లారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి.. అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు.
మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాగా, గ్రూప్-4 పరీక్షా కేంద్రంలోకి ఫోన్ తీసుకురావడం కలకలం రేపింది.
మరోవైపు, రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 8180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాస్తున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications