AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..!
ఏపీ ప్రభుత్వం ఇవాళ ఇంటర్ పరీక్ష ఫలితాలను (AP Inter Results 2026)విడుదల చేసింది. ఆన్ లైన్, వాట్సాప్ లో ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లోనూ బాలికలే టాప్ లో నిలిచారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 77 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 81 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతాలు, ఇతర వివరాలను విద్యాశాఖ ఇవాళ విడుదల చేసింది.
ఇంటర్ ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ కానీ, మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని పెట్టడం ద్వారా కానీ తెలుసుకోవచ్చు. ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని మొత్తం 5,10,307 మంది, సెకండియర్ పరీక్షల్ని 5,05, 609 మంది రాశారు. మొత్తం మీద 10,15,916 మంది పరీక్షలు రాశారు. వీరిలో జనరల్ కేటగిరీలో ఫస్టియర్ విద్యార్ధులు 77 శాతం, సెకండియర్ విద్యార్ధులు 81 శాతం మంది పాసయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కేటగిరీ బాలురు ఫస్టియర్ 72 శాతం, సెకండియర్ 76 శాతం పాసయ్యారు. అలాగే బాలికలు ఫస్టియర్ 81 శాతం, సెకండియర్ 85 శాతం ఉత్తీర్ణులయ్యారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణతా శాతం బాలికల్లో 75 నుంచి 81కి పెరిగింది. బాలుర ఉత్తీర్ణతా శాతం 66 నుంచి 72కు పెరిగింది. సెకండియర్ లో జనరల్ బాలికల ఉత్తీర్ణతా శాతం 86 నుంచి 85కు తగ్గింది. అలాగే బాలుర ఉత్తీర్ణతా శాతం కూడా 80 నుంచి 76కు తగ్గింది. ఒకేషనల్ లోనూ బాలురు, బాలికల ఉత్తీర్ణతా శాతాలు గతేడాది ఫలితాలతో పోలిస్తే తగ్గాయి.
సెకండియర్ ఫలితాల్లో కృష్ణా(92 శాతం), గుంటూరు (88 శాతం), ఎన్టీఆర్ (87) జిల్లాలు వరుసగా టాప్ లో నిలిచాయి. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా (90 శాతం), గుంటూరు (88 శాతం), విశాఖ (85 శాతం) టాప్ త్రీలో నిలిచాయి. అలాగే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ ఈ పరీక్షలు ఉంటాయి. ఫస్టియర్ లో అన్ని సబ్దెక్టులు పాసైన వారికి ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం ఉంటుంది.














Click it and Unblock the Notifications