గుడ్న్యూస్: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకిరస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వేళ సాకారమైంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంటాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో 2,909 జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ, 184 మంది జూనియర్ లెక్చరర్లు (వొకేషనల్), 390 మంది పాలిటెక్నికల్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాకులు, వైద్యశాఖలో 179 ల్యాబ్ టెక్నీషియన్, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. 'తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని పిచ్చివాళ్లు కొందరు కారుకూతలు కూశారని మండిపడ్డారు.
మొత్తం 40 విభాగాల్లో, 5544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల. https://t.co/w0TPP3QJp2 pic.twitter.com/hxTzoUoqBs
— Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023
కొన్ని పిచ్చివాంతులు కూడా చేసుకున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏంటీ? ఉన్నయన్ని కూలగొట్టి మళ్లీ కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్ల కడతారా? అని విపరీతమైనటువంటి, దుర్మార్గమైనటువంటి కురచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. మనం వేటినీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం గర్వంగా ప్రకటిస్తున్నా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications