Delhi Schools: పేదోడి ఆశలపై ఢిల్లీ గవర్నర్ హాట్ కామెంట్స్.. ప్రైవేట్ స్కూల్స్పై CMకు కీలక సిఫారసు..
EWS income limit: ఆర్థికంగా బలహీన వర్గాల(EWS)కు చెందిన విద్యార్థులకు ఆయా ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేసేలా చర్యలు తీసుకున్నాయి. అయితే వీటిలో కొంత భాగం సీట్లు ఖాళీగానే ఉండిపోతున్నాయి. ఆదాయం తక్కువైనా బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంలో కష్టపడుతున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వదులుకోరు. అయితే కొన్ని ప్రభుత్వ నిబంధనలు వారి ఆశలకు మోకాలడ్డుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (EWS)కు అడ్మిషన్ కోసం ఆదాయ పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారు. ఖాళీ సీట్లతో పాటు పెరిగిన కనీస వేతనాల కారణంగా ఈ మేరకు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక మరియు ద్వితీయ స్థాయిలలో EWS సీట్ల లబ్ధిదారులు ఉన్నత విద్యను కూడా పొందే అవకాశాలు ఉన్నందున ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉండటం సబబు అని సక్సేనా సూచించారు. ఢిల్లీ హైకోర్టు కేసుకు సంబంధించిన నివేదికలో ఆదాయ పరిమితికి సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రైవేట్ పాఠశాలల్లో EWS సీట్లకు వర్తించే ఆదాయ పరిమితి ఉన్నత విద్యా సంస్థల్లో 8 లక్షల మేర సరసంగా ఉండాలన్నారు. లేని పక్షంలో కనీసం 5 లక్షలకు పెంచాలని గవర్నర్ సూచించారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వు చేయబడిన నేపథ్యంలో ఈ మేరకు సిఫారసు చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన కనీస వేతనాల ప్రకారం నైపుణ్యం కలిగిన కార్మికుల వార్షిక ఆదాయం ప్రతిపాదిత 2.5 లక్షల పరిమితిని మించిపోతుంది. ఈ సందర్బంలో 1 లక్ష ఆదాయ పరిమితి అనేది సరికాదని సక్సేనా అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత 3 విద్యా సంవత్సరాల్లో ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలల్లో EWS కేటగిరీకి రిజర్వ్ చేసిన సీట్లలో సగటున 11 శాతం ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
'ఈ ఖాళీ సీట్లు ఢిల్లీ ప్రభుత్వ పరిమితి నిర్ధారణలో లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆదాయ పరిమితి తక్కువగా ఉంచడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది' అని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను 1 లక్ష ఆర్థిక పరిమితి ఖచ్చితంగా ప్రతిబింబించడంలేదన్నారు. అదే విధంగా డిసెంబర్ 5, 2023న ఢిల్లీ హైకోర్టు కూడా సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆదాయ పరిమితిని మార్చాలని తన ఆదేశాల్లో సూచించడం గమనార్హం.












Click it and Unblock the Notifications