తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలోనే 6 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాల వేగాన్ని పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన నిర్ణయం వల్ల వేలాది మంది అభ్యర్థులకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ చేసే అవకాశం లభించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) త్వరలో కీలక సమావేశం నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అందిన ఖాళీల వివరాలను సమీక్షించి, కొత్త నోటిఫికేషన్ల విడుదలపై నిర్ణయం తీసుకోనుంది. కమిషన్కు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 6,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యాశాఖలోనే అత్యధికంగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెయ్యికి పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండగా, పాలిటెక్నిక్ కళాశాలల్లో 300కు పైగా అధ్యాపక పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు (DIET), పాఠశాల విద్యాశాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్మెంట్ విభాగాల్లో కూడా వందల సంఖ్యలో ఖాళీలు గుర్తించారు. ఇక జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) పోస్టులు కూడా త్వరలో భర్తీ కానున్నాయి. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఎండీ టీజీపీఎస్సీకి అధికారికంగా లేఖ రాసినట్లు సమాచారం. అలాగే పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖల్లోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఉద్యోగార్థులకు ఇబ్బందులు కలగకుండా టీజీపీఎస్సీ ఈసారి కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒకే రోజు లేదా ఒకే సమయంలో రెండు పరీక్షలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించనుంది. దీంతో అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా అన్ని పరీక్షలకు హాజరయ్యే వీలుంటుంది. అలాగే అన్ని నోటిఫికేషన్లను ఒకేసారి విడుదల చేయకుండా, ప్రతి రెండు వారాలకు ఒక నోటిఫికేషన్ చొప్పున విడుదల చేసే విధానాన్ని కమిషన్ అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షల ప్రిపరేషన్కు కూడా సమయం దొరుకుతుందని ఉద్యోగార్థులు భావిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో నిరుద్యోగ సమస్యను తగ్గించడం, ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరతను నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఓటీఆర్ నమోదై ఉన్నప్పటికీ, కేవలం 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా దరఖాస్తులు చేస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. మిగిలిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, కేటగిరీలు, వ్యక్తిగత వివరాలు నవీకరించుకోవాలని సూచించారు. ఇంకా కొన్ని కీలక శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాల్సి ఉన్నందున, మొత్తం పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో త్వరలో భారీ ఉద్యోగాల జాతర మొదలుకానుందనే చర్చ నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.












Click it and Unblock the Notifications