JEE స్కోరు అవసరం లేకుండానే రెండు IIT ల్లో అడ్మిషన్లు..! పూర్తి వివరాలివే..!
కాలం మారుతోంది. దాంతో పాటే ఉన్నత విద్యలో ప్రవేశాల తీరు కూడా మారిపోతోంది. జేఈఈ (JEE) మెయిన్స్ రాస్తే కానీ, మంచి స్కోరు తెచ్చుకుంటే కానీ, జేఈఈ అడ్వాన్సెడ్ లో టాప్ స్కోరు వస్తే కానీ.. ఐఐటీల్లో (IIT) అడ్మిషన్లు దొరికేవి కావు. కానీ ప్రస్తుతం దేశంలో ఐఐటీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అవి కూడా తమ రూటు మార్చుకుంటున్నాయి. ఎంతలా అంటే ఇప్పుడు జేఈఈ అడ్వాన్సెడ్ స్కోరు అవసరం లేకుండానే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. అయితే దానికి అవసరమైన పరీక్షలు ఎలాగో ఉన్నాయి.
ఈ సంవత్సరం నుంచి నాలుగేళ్ల వ్యవధి గల, ప్రాక్టికల్ శిక్షణతో కూడిన 'బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' (B.Cyber) ప్రోగ్రామ్ను అందించేందుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్తో జతకట్టింది. ఈ ప్రోగ్రామ్ మొదటి బ్యాచ్కు ప్రవేశ ప్రక్రియను ఉమ్మడిగా నిర్వహిస్తారని, అయితే విద్యార్థులు తాము ఎంచుకున్న సంబంధిత సంస్థలోనే ఈ కోర్సును అభ్యసిస్తారని ఐఐటీ మద్రాస్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపింది.

అంతకుముందు, జేఈఈ స్కోర్లు అవసరం లేని ప్రత్యేక ప్రవేశ ప్రక్రియతో కూడిన ఈ కోర్సును ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. సీబీఎస్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలోని లోపాలను బయటపెట్టి వార్తల్లో నిలిచిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారిని, తమ C3iHub సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఇంజనీర్గా ఐఐటీ కాన్పూర్ నియమించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం దేశంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి , దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక రంగాలు, సైబర్ వ్యవస్థను రక్షించడానికి విద్యార్థులను సిద్ధం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.
ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియలో తాము కూడా భాగస్వాములవుతున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే సుమారు నెల రోజుల క్రితం ఈ ప్రక్రియను ప్రారంభించి, ఎంపిక దశలను పూర్తి చేసినందున, తాము ఆ ఎంపిక ప్రక్రియలో కలుస్తామని, ఎంపికైన ప్రతి విద్యార్థికి ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ కాన్పూర్లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇది సాధారణ బీటెక్ ప్రోగ్రామ్ లాంటిదేనని, డిగ్రీలో ప్రవేశం ఒకేలా ఉంటుందని, కోర్సు ప్రారంభమైన తర్వాత, ఇది స్వతంత్ర డిగ్రీగా ఉంటుందని ఐఐటీ మద్రాస్ ప్రతినిధి తెలిపారు.

వచ్చే సంవత్సరం నుంచి మాత్రం ప్రాథమిక గణితం, తార్కిక విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సామర్థ్య పరీక్షను అభ్యర్థులు రాయాల్సి ఉంటుందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఇందుకోసం ఎక్కువ వ్యవధి ఉండే ఒక హ్యాకథాన్ను నిర్వహిస్తారు. ఇందులో వారి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను, సైబర్ సెక్యూరిటీలో ఉన్న పరిజ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఈ హ్యాకథాన్, అందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్లిస్టింగ్ చేస్తారు.















Click it and Unblock the Notifications