డీఎస్సీ 2008 అభ్యర్థులకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్
2008 డీఎస్సీలో నష్టపోయి వారిలో 1382 మంది బీఈడీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారందర్నీ వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ విధానంలో తెలంగాణ విద్యాశాఖ టీచర్ ఉద్యోగాలను ఇవ్వనుంది. వారిని సెకండ్ గ్రేడ్ టీచర్లు(SGT)గా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి, మెరిట్ జాబితాలో ఉన్నా.. బీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ నాటి నుంచి నేటి వరకు అభ్యర్థులు పోరాడుతున్నారు. ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24న నిర్ణయం తీసుకుంది.
కాగా, 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో నష్టపోయిన అభ్యర్థులు మొత్తం 2367 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తామంటూ అభ్యర్థులు ఒప్పుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ కోరింది. ఈ క్రమంలో 1382 మంది అభ్యర్థులు కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి అంగీకరించారు.
ఈ నేపథ్యంలో వారికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు విధి విధానాలను రూపకల్పన చేసే ఫైల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. అయితే, ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం త్వరితగతిన వారికి ఉద్యోగాలనిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications