గురుకులాల్లో భారీగా ఉద్యోగాలు: 4వేలకుగాపై టీజీటీ పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేసన్ విడుదలైంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4006 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల్లో 75 శాతం అంటే 3012 పోస్టులు మహిళలకు కేటాయించనున్నారు.
994 పోస్టులను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు.
బాలికలు, మహిళా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలతో భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలున్నాయి. కాగా, 9231 పోస్టులకు ఏప్రిల్ 5న గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు 9 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో ఎనిమిది ప్రకటనలకు ఇప్పటికే సమగ్ర ప్రకటనలు వచ్చాయి.

తాజాగా విడుదలైన టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా 50 మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉండాలి.
లేదంటే లాంగ్వేజీలో డిగ్రీ లేదా లిటరేచర్లో డిగ్రీ లేదా సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50 శాతం మార్కులతోపాటు లాంగ్వేజీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి.దీంతోపాటు టెట్-పేపర్-2/సీటీఈటీ అర్హత ఉండాలి. డిగ్రీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 28 నుంచి మే 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.1200.. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష మూడు పేపర్లుగా 300 మార్కులకు ఉంటుంది. ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షకు వారం రోజుల ముందు మాత్రమే హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.












Click it and Unblock the Notifications