650 మందికి మర్చిపోలేని సాయం చేసిన స్టార్ హీరో..!
చిత్ర పరిశ్రమలో ఇటీవల జరిగిన ఓ విషాద సంఘటన అందరినీ కలచివేసింది. పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న 'వేట్టువం' సినిమా షూటింగ్లో ప్రముఖ స్టంట్ మాస్టర్ మోహన్ రాజు ప్రమాదవశాత్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన జరగగా.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై డైరెక్టర్ పా.రంజిత్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
కాగా ఈ ఘటన విషయం తెలిసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే స్టంట్ మాస్టర్స్ కోసం తన సొంత డబ్బులతో హెల్త్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించారు.

దేశవ్యాప్తంగా 650-700 మంది స్టంట్ మాస్టర్లకు ఇన్సూరెన్స్ చేయించినట్టు సమాచారం. ఈ పాలసీలో గాయపడిన వారికి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు కవరయ్యేలా.. మరణించిన వారి కుటుంబానికి రూ.20-25 లక్షల వరకు పరిహారం వచ్చేలా రూపొందించినట్టు తెలుస్తోంది.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక యాక్షన్ సీన్లు స్వయంగా చేసిన హీరోగా గుర్తింపు పొందారు అక్షయ్. అందుకే స్టంట్ ఆర్టిస్టుల కష్టాన్ని అర్థం చేసుకొని ఈ ఘటన జరగగానే తక్షణమే స్పందించి.. ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయించారని భావిస్తున్నారు.
ఈ విషయంపై యాక్షన్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ దహియా సంతోషం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్షయ్ కుమార్ చేసిన ఈ గొప్ప పని పట్ల నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అక్షయ్ కుమార్ కెరీర్ని పరిశీలిస్తే..
అక్షయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గత సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాపులవుతున్నాయి. సామ్రాట్ ప్రతాప, రక్షాబంధన్, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, హౌస్ ఫుల్ 5 లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 'కేసరి చాప్టర్ 2' తో హిట్ అందుకోగా.. తెలుగులో కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications