జీతం అడిగినందుకు కత్తితో పొడిచిన బాలీవుడ్ డైరెక్టర్..!
వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా.. ఈ షాకింగ్ ఘటన బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో జరిగిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మనీష్ గుప్తా.. తన డ్రైవర్పై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జీతం విషయంలో చెలరేగిన వివాదం ఈ హింసాత్మక ఘటనకు దారి తీసింది. బాధిత డ్రైవర్ రాజిబుల్ ఇస్లాం లష్కర్ గత మూడేళ్లుగా మనీష్ వద్ద పని చేస్తూ, నెలకు రూ. 23,000 జీతం తీసుకుంటున్నాడు.
ఏం జరిగింది?
వివరాల ప్రకారం.. మే 30న జీతం విషయంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో మనీష్ గుప్తా అతడిని అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించాడు. జూన్ 3న లష్కర్ ఫోన్లో జీతం గురించి అడిగితే.. తిరిగి పనిలో చేరితేనే చెల్లిస్తా అని గుప్తా తెలిపాడు. దీంతో లష్కర్ తిరిగి విధుల్లో చేరినా జీతం ఇవ్వకపోవడంతో తిరిగి గొడవలు ప్రారంభమయ్యాయి.

జూన్ 5న రాత్రి 8:30 గంటల సమయంలో వెర్సోవాలోని సాగర్ సంజోగ్ భవన్ లో గుప్తా నివాసంలో జరిగినట్టు చెబుతున్నారు. లష్కర్ జీతం గురించి మరోసారి ప్రస్తావించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం తీవ్రంగా మారిందని.. ఆ సమయంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన మనీష్ గుప్తా వంటగదిలోని కత్తితో డ్రైవర్పై దాడి చేశాడని సమాచారం.
అయితే గాయపడిన లష్కర్.. వాచ్మెన్ సహాయంతో చికిత్స కోసం విలేపార్లే వెస్ట్లోని కూపర్ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. చికిత్స అనంతరం వర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మనీష్ గుప్తాపై ఐపీసీ సెక్షన్లు 118(2), 115(2), 352 కింద కేసు నమోదు అయ్యింది. కానీ ఇంకా ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ తరఫున న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మనీష్ గుప్తా సినిమాలు..
మనీష్ గుప్తా బాలీవుడ్లో ప్రముఖ సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు, రచయితగా గుర్తింపు పొందారు. 'రహస్య', 'ది స్టోన్మ్యాన్ మర్డర్స్', 'వన్ ఫ్రైడే నైట్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. గతంలో రామ్ గోపాల్ వర్మ బృందంలో పనిచేస్తూ 'డి', 'సర్కార్' వంటి చిత్రాలకు స్క్రీన్ప్లే రాశారు.












Click it and Unblock the Notifications