సిరాజ్ను చూడగానే తట్టుకోలేకపోయిన ఆశా భోస్లే మనవరాలు! (వీడియో)
ప్రముఖ దిగ్గజ గాయని ఆశా భోస్లే మరణవార్త యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమెకు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖలు పెద్ద సంఖ్యలో ముంబైలోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఆశా భోస్లేకు తుది నివాళులర్పించేందుకు వెళ్లారు. అక్కడ మహమ్మద్ సిరాజ్ను చూడగానే ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై.. సిరాజ్ను పట్టుకుని బోరున విలపించారు.
మహమ్మద్ సిరాజ్, జానై భోస్లే మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరూ ఒకరినొకరు తోబుట్టువులుగా భావిస్తారు. ఆశా భోస్లే నివాసం వద్ద తీసిన ఓ వీడియోలో.. మహమ్మద్ సిరాజ్ అక్కడికి వచ్చిన జనసందోహంలో జానై భోస్లే కోసం వెతుకుతూ కనిపించారు. జానై భోస్లే కనిపించగానే ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేయగా.. ఆమె తట్టుకోలేక సిరాజ్ భుజంపై తలపెట్టి ఏడ్చారు. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mohammad Siraj consoles Zanai Bhosle as he arrives to pay final respects to Asha Bhosle ji. pic.twitter.com/oqijTyrZDX
— Jeet (@JeetN25) April 13, 2026
వీరిద్దరి రిలేషన్ షిప్పై గతంలో అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ.. జానై భోస్లే వాటిని కొట్టిపారేశారు. మహమ్మద్ సిరాజ్ తనకు అన్నయ్యతో సమానమని ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది రక్షాబంధన్ సందర్భంగా జానై భోస్లే సిరాజ్కు రాఖీ కట్టిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. తమ మధ్య ఉన్నది పవిత్రమైన అన్న చెల్లెళ్ల బంధమని చాటిచెప్పారు. మహమ్మద్ సిరాజ్ కూడా జానై భోస్లే పుట్టినరోజు వేడుకల్లో, కుటుంబ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఆమెకు అండగా ఉంటున్నారు.
జానై భోస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. ఆమె 'ది ప్రైడ్ ఆఫ్ భారత్-ఛత్రపతి శివాజీ మహారాజ్' అనే చిత్రంతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేయనున్నారు. ఆ సినిమాలో ఆమె శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోస్లే పాత్రలో కనిపించనున్నారు. నటనతో పాటు జానై భోస్లే మంచి గాయని, నృత్యకారిణి కూడా. ఆమె తన నాయనమ్మ ఆశా భోస్లేతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఆమె మరణం జానై భోస్లేని తీవ్రంగా కుంగదీసింది.












Click it and Unblock the Notifications