ప్రముఖ నటికి అర్ధరాత్రి ఘోర పరాభవం..!
కన్నడ బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివ్య సురేష్ బెంగళూరు నగరంలో తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వేళ బెంగళూరు వీధిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను, తన కజిన్ను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఈ బాధాకరమైన ఉదంతాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించిన నటి.. నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసులను నిలదీశారు.
33 ఏళ్ల దివ్య సురేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఆమె తన కజిన్తో కలిసి పార్క్ చేసి ఉన్న తన కారు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వారిని వెంబడించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి నడుస్తూనే అత్యంత అసభ్యకరమైన చేష్టలకు పాల్పడ్డాడు. దీనిని వెంటనే గమనించిన దివ్య సురేష్, ఆమె కజిన్ అతడిని గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా వారు కారు ఎక్కేంతవరకు వెంబడిస్తూనే ఉన్నాడు. రాత్రివేళల్లో నడిచినంత మాత్రాన ఏ మహిళ కూడా ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నటి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను దివ్య సురేష్ తన మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్లో.. "నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను" అని దివ్య సురేష్ చెప్పగా.. ఆమె కజిన్ ఆ వ్యక్తి చేతులను చూపిస్తూ "అక్కడ అతడి చేతిని చూడు" అని అనడం వినిపించింది. వారు కారులోకి వెళ్లగానే ఆ వ్యక్తి మరింత దగ్గరకు రావడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని ఆమె కజిన్ కోరడం ఆ వీడియోలో రికార్డయ్యింది. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆమె బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ.. "మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తామని మాకు ఇస్తున్న హామీలు, భద్రత ఎక్కడ ఉన్నాయి?" అంటూ ఘాటైన ప్రశ్నను సంధించారు.
దివ్య సురేష్ 2021లో ప్రముఖ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరించిన 'బిగ్ బాస్ కన్నడ సీజన్ 8'లో కంటెస్టెంట్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2017లో 'మిస్ ఇండియా సౌత్' టైటిల్ను గెలుచుకున్నారు. అదే ఏడాది '#9, హిల్టన్ క్రాస్' చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'రౌడీ బేబీ', 'హిరణ్య' వంటి సినిమాల్లో నటించారు. అలాగే కన్నడ టెలివిజన్ రంగంలో 'నన్న హెండ్తి ఎంబీబీఎస్', 'జోడి హక్కి' వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు.
అయితే దివ్య సురేష్ గతంలో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నారు. గతేడాది (అక్టోబర్ 4, 2025న) అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరులోని బ్యాటరాయనపుర సమీపంలో జరిగిన 'హిట్ అండ్ రన్' ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదానికి కారణమైన కారును నడిపింది నటి దివ్య సురేషేనని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై అప్పట్లో ట్రాఫిక్ వెస్ట్ డీసీపీ డాక్టర్ అనూప్ శెట్టి స్పందిస్తూ.. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని మీడియాకు వెల్లడించారు.












Click it and Unblock the Notifications