సినీ ప్రియులకు బిగ్ షాక్: టికెట్పై 2 శాతం సెస్?
Cess on Movie tickets and OTT: సినిమా లవర్స్కు బిగ్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మూవీ టికెట్లపై రెండు శాతం వరకు సెస్ విధించడానికి రంగం సిద్ధమైంది. అలాగే- ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా దీని పరిధిలోకి రానుంది. సబ్స్క్రిప్షన్ ఫీజుపైనా రెండు శాతం మేర సెస్ వసూలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో సినిమా, సాంస్కృతిక కళాకారులకు ఆర్థిక ప్రయోజనం కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫీజులపై వసూలు అయ్యే రెండు శాతం సెస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని సినిమా, సాంస్కృతిక కళాకారుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని భావిస్తోంది.

దీనికి సంబంధించిన ఓ బిల్లును రూపొందించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. కర్ణాటక సినీ, సాంస్కృతిక కళాకారుల సంక్షేమం బిల్లు- 2024ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సెస్ రూపంలో వచ్చిన మొత్తంతో కర్ణాటక సినీ, సాంస్కృతిక కళాకారుల సామాజిక భద్రత, సంక్షేమ నిధి పేరుతో ప్రత్యేకంగా ఓ ఫండ్ను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది.
ప్రతి మూడు సంవత్సరాలకోసారి సెస్ మొత్తాన్ని సవరించేలా బిల్లుకు రూపకల్పన చేసింది. ప్రభుత్వం నోటిఫై చేసిన టికెట్ల రేట్లపై సెస్ విధిస్తారు. ఈ సెస్ మొత్తం రెండు శాతానికి మించబోదని పేర్కొంది. అలాగే- సినిమా టికెట్లు, సబ్స్క్రిప్షన్ ఫీజులు, సంబంధిత చిత్ర నిర్మాణ సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంపై ఒక శాతం కంటే తక్కువగా ఉండకూడదు అని వివరించింది. ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై సెస్ ఎలా వసూలు చేయాలనే విషయం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కాగా- ప్రభుత్వం వసూలు చేసిన సెస్ మొత్తాన్ని కర్ణాటక సినీ, సాంస్కృతిక కళాకారుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేస్తారు. ఈ బోర్డులో కార్మిక శాఖ మంత్రి, అదనపు ముఖ్య కార్యదర్శి/ ముఖ్య కార్యదర్శి / కార్యదర్శి, కమిషనర్ సభ్యులుగా ఉంటారు. సినిమా, నాటకరంగానికి చెందిన నటీనటులు సహా 17 మంది సభ్యులుగా ఉంటారు.
అర్హులైన వారిని ఎంపిక బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, నాటకం, సంగీతం నృత్యం, జానపదం, లలితకళలు, యక్షగానం, బహిరంగ నాటకం వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన అకాడమీల ద్వారా సినిమా, సాంస్కృతిక కళాకారులకు ఈ ప్రత్యేక ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.












Click it and Unblock the Notifications