మా సినిమాను మహేష్ బాబు అభిమానులే సర్వ నాశనం చేశారు
మహేష్ బాబు నటించిన 'ఖలేజా' సినిమా రీ-రిలీజ్ మే 30, 2025న జరగనుంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాను 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
వాస్తవానికి 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, ఆ తర్వాత టీవీ, ఓటీటీలలో బాగా ఆదరణ పొంది కల్ట్ క్లాసిక్గా నిలిచింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

ఈ రీ-రిలీజ్కు భారీ స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రీ-రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. బుక్ మై షోలో కూడా టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి.
ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగానే రాబట్టింది. ప్రస్తుత జోరు చూస్తుంటే, రీ-రిలీజ్ పరంగా 'ఖలేజా' సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. రీ-రిలీజ్లో రూ. 10 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి తెలుగు సినిమాగా 'ఖలేజా' నిలిచే అవకాశం కనిపిస్తోంది.
మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా రీ-రిలీజ్ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల కంటే కూడా, థియేటర్లలో 'ఖలేజా'ను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ సినిమాకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి నిర్మాత సి. కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

'ఖలేజా' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులే అని షాకింగ్ కామెంట్స్ చేశారు.మహేష్ బాబు అభిమానులు సినిమాపై భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చారని, కానీ సినిమా చూసిన తర్వాత నిరాశపడ్డారని సి. కళ్యాణ్ అన్నారు.
మహేష్ బాబు కామెడీ చేయడం అభిమానులకు నచ్చలేదని, దాంతో వారు సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సినిమా విడుదల సమయంలో మిడ్నైట్ షోలు వేసే ఉద్దేశం తనకు లేదని, కానీ కొంతమంది అభిమానులు బలవంతంగా షో వేయించారని సి. కళ్యాణ్ వెల్లడించారు.
మిడ్నైట్ షో చూసిన కొంతమంది మహేష్ బాబు అభిమానులు మద్యం సేవించి తనకు ఫోన్ కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని, "నీకు సినిమా తీయడం తెలుసా?" అంటూ తిట్టారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అభిమానులే సినిమాకు నెగటివ్ టాక్ను వ్యాప్తి చేశారని, మొత్తంగా 'ఖలేజా' చిత్రం సర్వనాశనం కావడానికి వారే కారణమని సి. కళ్యాణ్ స్పష్టం చేశారు.
అయితే, ఇప్పుడు అదే అభిమానులు ఈ సినిమాను థియేటర్లో చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని సి. కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "బహుశా ఖలేజాకు తగిన గుర్తింపు రావడానికి 15 సంవత్సరాల సమయం కావాల్సి వచ్చిందేమో," అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications