మెగాస్టార్ సర్ ప్రైజ్: నూతన ప్రయోగం
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. అదే సమయంలో విశ్వంభర షూటింగ్ లో పాల్గొంటోన్నారు. దీంతో పాటు మెగా 158 కూ సైన్ చేశారు. బాబీ కొల్లి దర్శకుడు. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబోలో రాబోతోన్న మూవీ కావడం వల్ల మంచి అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.
ఇంత బిజీ షెడ్యూల్ మధ్య మెగాస్టార్ తన అభిమానుల కోసం ఓ కొత్త ప్రయత్నంతో రాబోతున్నారు. త్వరలో పాడ్ కాస్ట్ ప్రారంభించబోతోన్నారు. దీని ద్వారా ప్రతి అభిమానినీ పలకరించనున్నారు. తన జీవితంలోని ఎవరికీ తెలియని విశేషాలు, అరుదైన విషయాలను తన పాడ్కాస్ట్ ద్వారా పంచుకోనున్నారు. 50 సంవత్సరాల సినీ ప్రయాణానికి సంబంధించిన ప్రతి మజిలీ వివరాలు కూడా ఇందులో ఉండబోతోన్నాయి.

చిరంజీవి పాడ్ కాస్ట్ ప్రారంభించబోతోన్నారనే విషయాన్ని ప్రముఖ రచయిత బీవీఎస్ రవి వెల్లడించారు. 156 చిత్రాలలో నటించిన చిరంజీవి సినీ ప్రస్థానం ఈ పోడ్కాస్ట్కు ప్రధానాంశం. ఆయన ఎదుగుదల, సినీ జీవితంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు, చవి చూసిన చేదు అనుభవాలు, సినిమా వైఫల్యాలను ఇందులో ప్రస్తావించనున్నారు మెగాస్టార్. ఈ ప్రత్యేక ప్రసారం ద్వారా చిరంజీవి అభిమానులకు మరింత చేరువవుతారు.
తెలుగు సినీ జగమనే మహా సముద్రాన్ని చిరంజీవి అనేకసార్లు దాటారని బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఆయన జీవిత కథ రాబోయే తరాలకు తెలియడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బికెకు గతంలో పనిచేసిన అనుభవం ఉంది బీవీఎస్ రవికి. ఇప్పుడు ఈ చిరంజీవి పోడ్కాస్ట్కు రచన బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారు. దీంతో ఈ పాడ్ కాస్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి సంకేతాలు ఇచ్చారు కూడా. ఈ పోడ్కాస్ట్కు చిరంజీవితో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు సైతం అతిథులుగా వచ్చే అవకాశం ఉంది. ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ఆయన ప్రయాణ విశేషాలను కూడా ఈ కార్యక్రమం ఆవిష్కరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications