"నాగ దుర్గ" కొత్త బోనాల పాట రిలీజ్.. యూట్యూబ్ని షేక్ చేస్తున్న "లల్లాయిలే ఎల్లమ్మ" !!
నాగదుర్గ.. తెలుగు రాష్ట్రాల్ని ప్రజలకు సుపరిచితురాలే. యూట్యూబ్లో జానపద గీతాలు, డ్యాన్స్లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. "దారిపొంటత్తుండు", "నా పేరు ఎల్లమ్మ", "ఎర్ర రుమాల్", "కాపోళ ఇంటికాడ" వంటి ఫోక్ సాంగ్స్తో కోట్లాది వ్యూస్ సాధించింది. ఇప్పటికే ఫోక్ సింగర్గా, డాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా హీరోయిన్గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్, కోలీవుడ్ లలో దూసుకుపోతుంది. అయితే తనకు ఫేమ్ తీసుకొచ్చిన యూట్యూబ్ ని మాత్రం మర్చిపోకుండా మళ్లీ కొత్త పాటతో ట్రెండింగ్ గా నిలిచింది.
తెలంగాణ వ్యాప్తంగా జూలై 19 నుంచి రాష్ట్రంలో బోనాలు, అమ్మవారి ఊరేగింపు పండగలు, జాతరలు సాగనున్నాయి. బోనాల సందడి షురూ అయ్యిందంటే.. ఫోక్ సాంగ్స్ మారుమోగుతుంటాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ నెట్టింట దుమ్మురేపుతున్నాయి. గతేడాది నాగదుర్గ నా పేరే ఎల్లమ్మా.. జోగురాలమ్మ పాటలు ఏ స్థాయిలో మెప్పించాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు సరికొత్త బోనాల పాటతో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ఈ భామ. సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఫుల్ ట్రెండింగ్ గా నిలిచింది.

నాగదుర్గ నటించిన లేటేస్ట్ ఫోక్ సాంగ్ "లల్లాయిలే ఎల్లమ్మ" ఈ పాటను తెలంగాణ సంస్కృతి, బోనాల పండుగ బ్యాక్డ్రాప్లో ఎంతో ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించారు. ఇక ఎప్పటిలాగే ఈ పాటలో నాగదుర్గ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్తో, ఎనర్జిటిక్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. డీజే మిక్స్, తీన్మార్ బీట్స్తో సాగే ఈ సాంగ్ ముఖ్యంగా పండుగ సీజన్లో డీజేలలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పాటను ఫోక్ సింగర్ ప్రభ అద్భుతంగా పాడగా.. లల్లాయిలే మహేష్ గౌడ్ రాశారు. నరేంద్ర శర్మ సంగీతం అందించారు. జూలై 7న విడుదలైన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఇక యూట్యూబ్ స్టార్గా ఎదిగిన నాగదుర్గ ఇప్పుడు అదే క్రేజ్ను సినిమాల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో 'కలివనం' చిత్రంలో హీరోయిన్గా నటించిన నాగదుర్గ.. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళ చిత్రసీమలో కూడా అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న 'లవ్ ఓ లవ్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె కెరీర్లో అసలైన బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఇప్పుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం'అనే భావిస్తున్నారు.
'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్గా ఎంపికైంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో దొండపాటి వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నాగదుర్గ 'శ్రీలత' అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆమె లుక్కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'ఇడుపు కాయితం' అనే విభిన్నమైన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.












Click it and Unblock the Notifications