బుక్ అయిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బుక్ అయ్యారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజనులను కించపర్చారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు.
ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఇదివరకే సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు రికార్డయింది. ఇదే కారణంతో ఇప్పుడు తాజాగా రాయదుర్గం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పహల్గామ్ దాడులనుగిరిజన యుద్ధాలతో పోల్చడం.. ఈ కేసులకు కారణమైంది. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఈవెంట్ లో ప్రసంగించారు.
500 సంవత్సరాల కిందట గిరిజనులు కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా పాకిస్తానీయులు.. భారత్ పై ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో బహిరంగంగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో కరెంటు, నీళ్లు లేవని, వాళ్ల దేశాన్ని వాళ్లు చూసుకోకుండా భారత్ కు వచ్చి దాడులు చేస్తోన్నారని అన్నారు.
పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు దిగాల్సిన అవసరం కూడా భారత్ కు లేదని, పాకిస్తానీయులకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద వాళ్లే తిరుగుబాటు చేస్తారని అన్నారు. ఈ క్రమంలో గిరిజనుల ప్రస్తావన తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ. 500 సంవత్సరాల కిందట ట్రైబల్స్ కొట్టుకున్నట్టు, బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా దాడులు చేశారని అన్నారు.
దీనిపై తాజాగా గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజనులను విజయ్ దేవరకొండ కించపరిచారని, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications