పుష్ప2 మళ్లీ వాయిదా... అల్లు అర్జున్తో బయటపడ్డ విభేదాలు?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యుల మధ్య విభేదాలతోపాటు ఏపీలో పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్న గొడవలతో సినిమాను డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిసెంబరు ఆరుకు రావడం కూడా కష్టమేనని స్పష్టమవుతోంది. రాజమౌళి బాహుబలి1 విడుదల చేసిన రెండు సంవత్సరాలకే థియేటర్లలోకి బాహుబలి2 తీసుకువచ్చారు. కానీ పుష్ప1 విడుదలై మూడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో హీరో, దర్శకుడు, నిర్మాతలకే స్పష్టతలేదు.
హీరో, దర్శకుడి మధ్య విభేదాలు
సుకుమార్ కు అల్లు అర్జున్ తో విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిచ్చేలా సుకుమార్ షూటింగ్ చేయకుండా అమెరికా వెళ్లిపోయారు. అక్కడినుంచి తిరిగివచ్చి వారం రోజులవుతున్నా ఇంతవరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. మరోవైపు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఎప్పుడు వస్తారనే విషయం ఎవరికీ తెలియదు. మరోవైపు ఈ సినిమాకు రోజురోజుకు బడ్జెట్ పెరిగిపోతుండటంపై నిర్మాతలు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు బడ్జెట్ కేటాయించామో అంతలోనే సినిమా పూర్తవ్వాలనే షరతు విధించారు.

రెండు నెలల క్రితం రామోజీ ఫిలింసిటీలో సెట్
పుష్ప2 షూటింగ్ కోసం రామోజీ ఫిలింసిటీలో రెండు నెలల క్రితం సెట్ వేశారు. ఆ సెట్ వేసిన తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా షూటింగ్ జరగలేదు. దానికి అద్దె మాత్రం కడుతున్నారు. ఫహాద్ ఫజిల్ కు స్కిన్ ఎలర్జీ వచ్చి అందుబాటులో లేకపోవడంతో సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఐటం సాంగ్ కూడా ఇంతవరకు చిత్రీకరించలేదు. ఒకేసారి మూడు యూనిట్లు పెట్టి సినిమాను త్వరగా పూర్తిచేయాలని అల్లు అర్జున్ సుకుమార్ పై ఒత్తిడి తెస్తున్నప్పటికీ అలా కుదరదని ఖరాఖండిగా ఆయన తేల్చేశారు. సినిమా బాగా రావాలంటే ప్రతి సన్నివేశంపై తన పర్యవేక్షణ ఉండాల్సిందేనన్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుండటంతోపాటు సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయం కూడా ఎవరికీ తెలియడంలేదు.












Click it and Unblock the Notifications