రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ డబ్బులివ్వలేదా?
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ కు గురైన శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీతేజ్ తల్లి రేవతి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్.. అంతమొత్తం ఇవ్వలేదని, కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకుడు బక్క జడ్సన్ తెలిపారు.
కమిషనర్ ప్రకటనతో అవన్నీ అబద్ధమని తేలిపోయింది
రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించామనే మాటల్లో వాస్తవం లేదని, కేవలం రూ.10 లక్షలు అందించారని, అల్లు కుటుంబం అబద్దం చెబుతోందంటూ బక్క జడ్సన్ మండిపడ్డారు. ఇప్పటికే ఈ విషయంలో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శ్రీతేజ్ కుటుంబ ఖర్చులన్నీ బన్నీయే భరిస్తున్నాడని, సింగపూర్ నుంచి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. అయితే కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటనతో అవన్నీ అబద్దమని తేలిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

నాంపల్లి కోర్టులో ఏం జరగబోతోంది?
కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. న్యాయపరమైన అడ్డంకులవల్ల బన్నీ రాలేకపోతున్నాడని, అందుకే తాను వచ్చినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. శ్రీతేజ్ బ్రెయిన్ డెత్ కు గురికావడంతోపాటు వెంటిలేటర్ పై ఉన్నాడు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేయమని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైకోర్టు నాలుగు వారాలపాటు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బయట ఉన్నారు. నాంపల్లి కోర్టు నాలుగు వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోతే రిమాండ్ ఖైదీగా జైలులో ఉండాల్సిన పరిస్థితి అల్లు అర్జున్ కు తలెత్తబోతోంది. దీనిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పుష్ప2 సినిమా భారీ కలెక్షన్లు సాధించిందన్న ఆనందం తమ హీరోకు లేకుండా పోయిందని బన్నీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications