ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రజినీకాంత్ రికార్డ్
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు వాడుతున్నారు కానీ ఆరోజుల్లోనే ఆయన పాన్ ఇండియా హీరో. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాలు చేసేవారు. ఆయన సినిమాలు హిందీలో కూడా విడుదలయ్యేవి. పాన్ ఇండియా తొలితరం హీరోల్లో రజినీకాంత్ ఒకరు. ఆయన ఇమేజ్ గురించి, ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. జైలర్ సినిమాతో రూ.700 కోట్లు కొల్లగొట్టిన రజినీ కూలీ సినిమాతో రూ.వెయ్యి కోట్లు రాబట్టి తమిళ చిత్రసీమకు మంచి బహుమతివ్వాలని భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై రోజురోజుకు విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఆసియా ఖండంలో తొలిసారిగా
రజినీకాంత్ కు తోడుగా అక్కినేని నాగార్జున విలన్ గా నటించడం, ఉపేంద్ర లాంటి కన్నడ స్టార్ కీలక పాత్ర పోషించడంలాంటివన్నీ కూలీకి కలిసివస్తున్నాయి. ఇప్పటికీ విడుదలైన గ్లింప్స్ సూపర్ హిట్ అయింది. రజనీకాంత్ అభిమానులతోపాటు దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులంతా కూలీ కోసం ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.450 నుంచి రూ.500 కోట్లుగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ఆసియా ఖండంలోనే తొలిసారిగా రూ.280 కోట్ల అత్యధిక పారితోషికాన్ని రజినీకాంత్ అందుకున్నారు.

తమిళ పరిశ్రమకు రూ.వెయ్యి కోట్ల సినిమా కావాలని..
అక్కినేని నాగార్జునకు రూ.24 కోట్లు ఇచ్చారు. శ్రుతిహాసన్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ తర్వాత రజినీ కూలీ చేస్తున్నారు. దీనితర్వాత జైలర్2 చేయనున్నారు. ఇలా ఒకే నిర్మాణ సంస్థలో మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. తమిళ చిత్రసీమ నుంచి రూ.వెయ్యి కోట్ల సినిమా లేదని ఆ పరిశ్రమ పెద్దలు, అభిమానులు వాపోతున్నారు. విజయ్ నటించిన లియో రూ.వెయ్యి కోట్లు రాబడుతుందనుకున్నారుకానీ అది కూడా రూ.600 కోట్ల దగ్గర ఆగిపోయింది. దీంతో కూలీపై అభిమానులు, తమిళ పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. వారి ఆశలు నెరవేరతాయో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు ఓపిక పట్టక తప్పదు.












Click it and Unblock the Notifications